హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం పరువునష్టం దావా వేశారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 9వ చీఫ్ జడ్జ్ ముందు ఇంజక్షన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎంపీ పర్వేశ్ వర్మ, మంజీందర్సింగ్ సిర్సా తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు, నిరాధార ఆరోపణలు చేసి, ప్రజాజీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించే ప్రకటనలు చేశారని ఆమె పేర్కొన్నారు. ప్రజల్లో తనకున్న మంచి పేరును, ప్రతిష్టను చెడగొట్టడానికి అక్రమ పద్ధతులను వారు ఎంచుకున్నారని ఆమె పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం లేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసిన బీజేపపీ నేతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్సీ కవిత కోర్టును కోరారు.