కంటోన్మెంట్, ఏప్రిల్ 12: రానున్న నెల రోజుల పాటు కంటోన్మెంట్లోని బీఆర్ఎస్ శ్రేణులు అత్యంత క్రియాశీలకంగా పని చేసి గులాబీ జెండా ఎగిరే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి సూచించారు. శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో వెస్ట్ మారేడ్పల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయీభవ అంటూ నివేదితను తలసాని ఆశీర్వదించారు.
అనంతరం నివేదిత ఎమ్మెల్యే మల్లారెడ్డిని బోయిన్పల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తలసాని, మల్లారెడ్డి మాట్లాడుతూ కంటోన్మెంట్ జనమంతా కారు వైపే ఉన్నారని, అధైర్యపడాల్సిన అవసరం లేదని, కలిసికట్టుగా ముందుకు సాగితే విజయం మనదేనన్నారు. నియోజకవర్గంలో ఏ వార్డులోకి వెళ్లినా 80 నుంచి 90 శాతం మంది ఓటర్లు బీఆర్ఎస్ వారే ఉన్నారని, ప్రతి వార్డులో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండటంతో పాటు పార్టీ శ్రేణులు, ప్రజలతో మమేకం కావాలని నివేదితకు సూచించారు.
దివంగత ఎమ్మెల్యే సాయన్న సేవలను కంటోన్మెంట్ ప్రజలు ఎన్నటికీ మరువబోరని చెప్పారు. అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డితో నివేదిత సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. సాయన్న కుటుంబానికి ప్రజల్లో ఉన్న సానుకూలత నేపథ్యంలో మరింత ముమ్మరంగా ప్రచారం చేసి, భారీ మెజార్టీ సాధించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆయా సమావేశాల్లో మాజీ కార్పొరేటర్ రూప, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.