బేగంపేట్, డిసెంబర్ 30 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో స్పష్టం చేయాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శనివారం మారేడ్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని ముఖ్య నాయకులు, కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులలో అర్హులను ఎప్పటిలోగా ఎంపిక చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే విధంగా నిర్ధిష్టమైన దరఖాస్తులను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.
ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు సరిపడా లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని చోట్ల కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దరఖాస్తుల కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు చేసే పథకాలకు తాము సహకరిస్తామని అన్నారు. ఆరు గ్యారంటీల కోసం అర్హులైన వారు జనవరి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరినందున అర్హులైన వారితో దరఖాస్తు చేయించాలని సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లకు, ముఖ్య నాయకులకు, మాజీ కార్పొరేటర్లకు సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీస్తారని అన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు మహేశ్వరి, కొలన్ లక్ష్మి, హేమలతా, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.