హైదరాబాద్ : అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani)అధికారులను ఆదేశించారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్లోని చుట్టాల బస్తీ, నల్లగుట్ట, వార్డ్ ఆఫీస్, జే లైన్, ఎఫ్ లైన్, సీ లైన్ తదితర ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జే లైన్లో కలుషిత నీరు సరఫరా అవుతుందని స్థానిక మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగా, సమస్య పరిష్కారం కోసం నూతన సీవరేజ్, వాటర్ పైప్ లైన్ పనులను మంజూరు చేసినట్లు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పనులను ప్రారంభిస్తామని వివరించారు. పలు రోడ్లలో సీవరేజ్ నుండి ఓవర్ ఫ్లో అయి మురుగునీరంతా రోడ్లపై ప్రవహిస్తుందని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలపగా, స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.