ఎల్బీనగర్( హైదరాబాద్ ) : రోడ్డు విస్తరణలో గుడిసెలు కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి (MLA Sudhir Reddy) అన్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా హయత్నగర్(Hayatnagar) రేడియో స్టేషన్ ప్రధాన రహదారిపై నివసిస్తున్న వారి గుడిసెలను తొలగించడం పట్ల ఎమ్మెల్యే గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు.
గతంలో ఆటోనగర్ క్రీడా ప్రాంగణం వద్ద ఉన్న సమయంలో గుడిసె వాసుల సమస్యలను పరిష్కరించానని గుర్తు చేశారు. ఆటోనగర్లో అంతర్జాతీయ బస్ టెర్మినల్(Bus terminal) ప్రతిపాదనలో భాగంగా గుడిసెవాసులను హయత్నగర్ రేడియో స్టేషన్ వద్దకు తరలించారని తెలిపారు. రేడియో స్టేషన్ వద్ద కరెంటు సౌకర్యం, మూత్రశాలలు, మంచినీరు,వీధి దీపాలు , వీధి వ్యాపారుల లైసెన్స్లు ఇప్పించామన్నారు. జాతీయ రహదారి విస్తరణలో గుడిసెలు తొలగిస్తే వారికి పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ను కోరుతానని పేర్కొన్నారు. గుడిసెవాసులను న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.