వనస్థలిపురం, ఏప్రిల్ 30 : పోలీస్ స్టేషన్ సమీపంలో డబ్బాలలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నవారికి అండగా నిలుస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవురెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. చిరు వ్యాపారుల డబ్బాలు తొలగించాలని జిహెచ్ఎంసి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యే అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు పైన డబ్బాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్న వారికి గతంలో ప్రభుత్వం జిహెచ్ఎంసి నుండి లైసెన్స్ మంజూరు చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డబ్బాలను తొలగిస్తామని నోటీసులు జారీ చేయడం సరికాదన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరు ఎలాంటి భయాందోళనకు లోనవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఒక్క డబ్బా కూడా తొలగించకుండా చూస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. చిన్న చిన్న వ్యాపారాలతోనే బాధితులు వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని, వారి ఉపాధిని దూరం చేస్తే ఆయా కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నోటీసులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింతల రవికుమార్, మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.