Sabitha Indra Reddy | షాబాద్ : నేడు చేవెళ్లలో జరిగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాలలోని సభా ప్రాంగణాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర యువనేత కార్తిక్రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. శనివారం చేవెళ్లలో జరిగే సభకు 2 లక్షల వరకు జనసమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త రాంబాబు యాదవ్, డీసీఎంఏస్ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.