Sabitha Indra Reddy | షాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణ అంటేనే కేసీఆర్.. ప్రజలు బాగుండాలని నిరంతరం ఆలోచించే ఏకైక వ్యక్తి ఆయన అని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ నిశానా చెరిపేస్తానని సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని, అది సాధ్యమయ్యేది కాదని చెప్పారు. సోమవారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విసృత్తస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్సీలు దయానంద్గుప్తా, సురభి వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ…96 కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి.. ఆ కులాల సమస్యలను అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఘనత కాసాని జ్ఞానేశ్వర్కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని, కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఒక భరోసా ఉండేదని, మూడు నెలల నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం లేదన్నారు. దీంతో రాష్ట్రంలో పాలన ఏ విధంగా సాగుతున్నదో ప్రజలు ఆలోచించాలన్నారు.
బీఆర్ఎస్ నుంచి ఎవరూ ఎక్కడకు పోయినా.. 60 లక్షల మంది సైన్యం కేసీఆర్ వెంటే ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదా మరిచి మాట్లాడుతున్నారని, ఇంకా పీసీసీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగానే మాట్లాడే విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి చేవెళ్లకు సాగునీరు రావాలంటే చేవెళ్ల గడ్డపై ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలవాలన్నారు.
మోదీని చూసి ఓటు వేయమని బీజేపీ నాయకులు అడుగుతున్నారని, దేవుడి పేరు, మతం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడం తప్ప.. ప్రజలకు ఏమైనా చేయాలన్న ఆలోచన బీజేపీ వాళ్లకు లేదన్నారు. బీజేపీకి తెలంగాణపై అంతా ప్రేమ ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. ఈ నెల 13న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్లకు వస్తున్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, జడ్పీటీసీలు పట్నం అవినాశ్రెడ్డి, కాలె జయమ్మ, గోవిందమ్మ, కాలె శ్రీకాంత్, ఎంపీపీలు గోవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
96 కులాలను కలుపుకొని వ్యవస్థను నడిపించిన కాసాని జ్ఞానేశ్వర్ గొప్ప వ్యక్తి. కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలి. ప్రతిపక్షాలు మాట్లాడే మాటలన్నీ నీటిమీద రాతలాంటివి. పదేండ్లలో కరెంట్, తాగునీరు, విద్య, వైద్యం తదితర విషయాల్లో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచింది.
-సురభి వాణీదేవి, ఎమ్మెల్సీ
చేవెళ్ల ఎంపీగా నాకు అవకాశం కల్పిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. గతంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్సీగా సేవలందించా. అప్పట్లో గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు అందించాను. ఈ నెల 13న కేసీఆర్ చేవెళ్ల నుంచి ఎన్నికల శంఖరావాన్ని పూరించబోతున్నారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
– కాసాని జ్ఞానేశ్వర్, చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అందించిన పథకాలను ప్రజలకు వివరించాలి. అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు పథకాలు అమలు చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీసీ నేత, సీనియర్ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి. పేదలకు అందించిన పథకాల గురించి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న విషయాలను వివరించాలి. జ్ఞానేశ్వర్ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి.
– దయానంద్గుప్తా, ఎమ్మెల్సీ
ప్రధాని మోదీ నోట్లు రద్దు చేసినప్పుడు నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్క రైతు అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారు. అవి వేశాకే ఓటు వేస్తామని ప్రజలు చెప్పాలి. రూ.400 పైచిలుకు ఉన్న గ్యాస్ రూ.1200 అయ్యిందంటే.. అది బీజేపీ వాళ్ల పుణ్యమే. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడిని ఇబ్బందులు పెడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. సమష్టి కృషితో విజయం సాధిద్దాం. కార్యకర్తలకు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా.. అండగా ఉంటాం. బీఆర్ఎస్ కార్యకర్తల శక్తిని తక్కువగా అంచనా వేసి రంజిత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. మన శక్తి ఏమిటో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఎన్నికలను ప్రతి కార్యకర్త చాలెంజ్గా తీసుకోవాలి. చేవెళ్ల ఎంపీగా కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించి.. కేసీఆర్కు కానుక ఇద్దాం.
-సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే