మొయినాబాద్, ఏప్రిల్ 28 : ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న రంజిత్రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తనూ సన్నద్ధం చేసేందుకు ఆదివారం సాయంత్రం మండల కేంద్రంలోని స్టార్ కన్వెన్షన్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన ముఖ్య కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
దీనికి బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వచ్చి వాటిని కూడా వ్యాపార కోణంలోనే చూస్తూ కలుషితం చేస్తున్నారన్నారు. అలాంటి వ్యక్తుల పట్ల బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ల నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విశ్వేశ్వర్రెడ్డి, రంజిత్రెడ్డిలను కేసీఆర్ ఆదరించి చేరదీసి ఎంపీలుగా గెలిపిస్తే స్వార్థం కోసం పార్టీలు మారారని మండిపడ్డారు. రంజిత్రెడ్డికి సీఎం కేసీఆర్, కేటీఆర్ అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు.
చేవెళ్ల ఎంపీగా పనిచేసిన రంజిత్రెడ్డి ఎప్పుడు కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని.. అభివృద్ధికి కృషి చేయలేదని సబితారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన రంజిత్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డిని, ఆరు గ్యారెంటీలను చూసి ఓట్లు వేయాలని ఓటర్లను అడుక్కునే దుస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. అలాగే బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డి జై శ్రీరాం అనండి ఓటేయండి… నరేంద్ర మోదీని చూసి ఓటేయాలని అడుగుతున్నారన్నారు. వారిద్దరూ నియోజకవర్గాభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదన్నా రు. కాసాని జ్ఞానేశ్వర్ గతంలో రంగారెడ్డి జడ్పీచైర్మన్గా పనిచేసి ఎంతో అభివృద్ధి చేశారని.. బీసీ కులాల అభ్యున్నతికి పాటుపడ్డారని.. అలాంటి వ్యక్తిని ఎంపీగా గెలిపించుకోవాలన్నారు.
జీవో 111ను ఎత్తివేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని తెలిసినా.. సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి పోరాటం చేస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొని.. దానిని ఎత్తివేస్తున్నట్లు జీవోను జారీ చేయించారని గుర్తు చేశారు. జీవో 111 ఎత్తివేత కోసం తీసుకొచ్చిన జీవో 69ను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసానిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందాయన్నారు.
కానీ.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో 140 రోజుల్లోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కరెంట్ పోతే ప్రజలకు కేసీఆరే గుర్తుకొస్తున్నారని తెలిపారు. కార్యకర్తలందరూ సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని.. కేసులకు భయపడొద్దన్నారు. ప్రతి కార్యకర్తకూ స్థానిక ఎమ్మెల్యే నుంచి కేసీఆర్ వరకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. కాసాని జ్ఞానేశ్వర్ను అధి క మెజార్టీతో గెలిపించేందుకు ఇంటింటికెళ్లి బీఆర్ఎస్ హయాంలో అమలైన పథకాల ను వివరించి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు.
సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి రాంబాబుయాదవ్, రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, సీనియర్ నాయకులు ఆంజనేయులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ రితీశ్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గణేశ్రెడ్డి, బీఆర్ఎస్ మండ ల ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్, ఉపాధ్యక్షుడు జయవంత్, రవూఫ్, వెంకట్రెడ్డి, రాజు, శ్రీహరియాదవ్, మహబూబ్, కృష్ణారెడ్డి, ప్రవీణ్రెడ్డి, తిరుపతిరెడ్డి, పరమేశ్, యాదగిరిచారి, మనోజ్కుమార్, మహేందర్రెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.