బండ్లగూడ,మే 15: రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన ప్రకాశ్గౌడ్ నాలుగు రోజులు కూడా ప్రజలకు సక్రమంగా నీళ్లివ్వలేకపోతున్నారని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్రెడ్డి విమర్శించారు. మంచినీటి సరఫరాపై ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్కు కనీస అవగహన లేకపోవడం వల్లే ప్రజలకు నీటి ఇక్కట్లు తప్పడం లేదన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు మంచినీటి సమస్యపై వాక్ ఫర్ వాటర్ నినాదంతో పోరాటం ప్రారంభించారు. మొదటి రోజు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కిస్మత్పూర్ గ్రామం నుంచి బండ్లగూడ కూడలి వరకు పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ పాదయాత్రలో పలువురు కాలనీవాసులు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్తీక్రెడ్డి మాట్లాడుతూ బండ్లగూడ, కిస్మత్పూర్, హైదర్షాకోట్ తదితర ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు ఎన్ని ఉన్నాయో అధికారులకు తెలియదు, ఇక మంచినీటిని ఎలా అందిస్తారని మండిపడ్డారు. ఇక్కడ 40వేల నల్లా కనెక్షన్లు ఉంటే 15వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయని, వాటికి సరిపడా నీటిని అందిస్తున్నామని అధికారులు చెప్పడం అవివేకమన్నారు. తాము పాదయాత్ర చేస్తున్న సమయంలో అనేక వాటర్ ట్యాంకర్లు కనిపించాయన్నారు. ట్యాంకర్లను బట్టి నీటి ఎద్దడి ఎంతగా ఉందో తెలుస్తుందన్నారు.
తాము మంచినీటి సమస్యపై పోరాటం చేస్తున్నామని తెలిసి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఆఘమేఘాలపై అధికారులతో చర్చలు జరిపారని తెలిపారు. ఇప్పటి వరకు ప్రజలు సమస్యలు గుర్తుకు రాలేదా.. తాము పోరాటం ప్రారంభించగానే ఎమ్మెల్యేకు ప్రజల సమస్యలు గుర్తుకు వచ్చాయా? అని ప్రశ్నించారు. పది రోజులకు ఒక్కసారి నీటి సరఫరా ఉందంటే అధికారులు ఎందుకు పని చేస్తున్నట్టు, ఎవరికోసం పని చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మంచినీటి నల్లా బిల్లులను వెంటనే మాఫీ చేయాలని కోరారు.
రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జలాశయాల నుంచి నీటిని రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు అందిస్తామన్నారు. హైదర్బాద్కు ఏది కావాలన్నా గండిపేట మండలంపైనే ఆదారపడి ఉన్నారన్నారు. ఇక్కడి ప్రజల ఓట్లు కావాలి, ఇక్కడి భూములు అమ్ముతారు, టాక్స్లు పెంచుతారు కాని నీటి సమస్యలను మాత్రం పటించుకోరా? అని మండిపడ్డారు. గండిపేట మండలంలో అనేక రకాల వనరులను వాడుకుంటూ పది రోజులకు ఒక్కసారి నీటిని వదలడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రజలు సమస్యల నుంచి గట్టెక్కాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. వాక్ ఫర్ వాటర్ కార్యాక్రమానికి ఆయన విచ్చేసి కార్తీక్రెడ్డితో కలిసి పాదయాత్రలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ తెస్తానన్న కేసీఆర్ తెచ్చి చూపించారు. అనేక పోరాటాల మధ్య తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదన్నారు. అబద్దాలతో గెలిచిన కాంగ్రెస్, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.
దీంతో మళ్లీ కేసీఆర్ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నామన్నారు. అందుకే సారు మల్లొక్కసారి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి రావుల కోళ్ల నాగరాజు, మాజీ మేయర్ లతా, మాజీ కార్పొరేటర్ రవీందర్రెడ్డి, నాయకులు రాముడు యాదవ్, దుర్గేష్, గంగని రవికుమార్, ముక్తార్, వెంకటేష్, సీతారాం, నవీన్, తిరుపతిరెడ్డి, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.