మణికొండ/మైలార్దేవ్పల్లి: బీఆర్ఎస్ను మోసం చేసిన రంజిత్రెడ్డిని పార్లమెంటు ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కేవీఎంఆర్ ప్రైడ్ గార్డెన్స్లో శనివారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శక్తివంచన లేకుండా పోరాటం చేసి స్వరాష్ర్టాన్ని సాధించి పెట్టిన కేసీఆర్కు వెన్నంటే ఉంటూ.. చేవెళ్ల గడ్డపై గులాబీ జెండాను ఎగురవేసి ఆయనకు బహుమానంగా అందించాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గడపగడపకు వివరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలైన విషయాలను ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులు తెలియజేసి..ఓట్లను అభ్యర్థించాలని కోరారు. కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలన్నారు.
ఈనెల 13న చేవెళ్ల గడ్డపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించే భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేపట్టాలని శ్రేణులను కోరారు. అలాగే మైలార్దేవ్పల్లిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు మరింత బలం పుంజుకుంటుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ రేఖ యాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, మాజీ ఎంపీపీ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.