మణికొండ, ఏప్రిల్ 10: మీ కోసం నిస్వార్థంగా పని చేశానని, మీ ఆత్మీయతే నాకు కొండంత బలమని… అందుకే మూడు సార్లు మీరంతా నా బలగమై అఖండ విజయాన్ని అందించారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలో పార్టీ అధ్యక్షుడు రామేశ్వరం నర్సింహ ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సుస్థిర పాలకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని నార్సింగి, మణికొండ, బండ్లగూడ, రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో చేసిన, కొనసాగుతున్న అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. నార్సింగి మున్సిపాలిటీలో 1050 పింఛన్లకు గాను రూ. 48లక్షల 78వేలు, గత నెలలో 378 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ.55లక్షలు, రైతుబంధు ద్వారా యాసంగి పంటకు 789 రైతులకు రూ.61లక్షలు చెల్లించామని వివరించారు. రైతు బీమా కింద గతేడాది 11మంది రైతు కుటుంబాలకు రూ.55లక్షలు మంజూరు చేశామన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా 7,498 మందికి రూ.2లక్షల 12వేలు, సీఎం సహాయనిధి ద్వారా 144మందికి రూ.71లక్ష 17వేలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఆసరా పింఛన్ల ద్వారా ఇతర పథకాలతో కలిసి రూ.238కోట్లు ప్రతినెలా ప్రజాసంక్షేమం కోసం వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
సొంతగూటికి ఉద్యమ నేత ;బీఆర్ఎస్లో చేరిన పత్తి ప్రవీణ్కుమార్
వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉద్యమ నేత, కౌన్సిలర్ పత్తి ప్రవీణ్కుమార్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆహ్వానం మేరకు ఆయన సమక్షంలో సోమవారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రవీణ్ చేరిక సందర్భంగా నార్సింగి ప్రధాన చౌరస్తా నుంచి రాయల్ ఫంక్షన్హాల్ వరకు ఫ్లెక్సీలతో గులాబీమయంగా మారింది. ప్రవీణ్ రాక పార్టీకి మరింత బలం, బలగం పెరిగిందంటూ ఎమ్మెల్యే తెలిపారు. మంచికి మారుపేరుగా ఉన్న ఎమ్మెల్యే ఆత్మీయతను గుర్తించి తాను తన సొంతింటికి వచ్చానని పత్తి ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే గెలుపే లక్ష్యంగా శక్తివంచన లేకుండా పని చేస్తానని స్పష్టం చేశారు. దాదాపు 600 మంది నాయకులు, కార్యకర్తలు పత్తి ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు.