కవాడిగూడ, ఆగస్టు 28: కార్యకర్తలు, నాయకుల ప్రోత్సాహంతోనే నియోజక వర్గంలో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడలేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి పేదల సంక్షేమానికి కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ముషీరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో టీఆర్ఎస్ ముషీరాబాద్ నియోజక వర్గం విస్రృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడేండ్ల కాలంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు.
ముషీరాబాద్ నియోజక వర్గంలోని డివిజన్లలో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని,వచ్చే నెలలో రాష్ట్ర, జిల్లా, నియోజక వర్గాలు, మండల స్థాయి, బూత్ స్థాయి కమిటీలున్నాయని, పని చేసిన నాయకులు, కార్యకర్తలను పార్టీ గుర్తించి పదవులను కట్టబెడుతుందని అన్నారు. పదవులు రానివారు బాధపడవద్దని అన్నారు. ముఖ్యంగా ముషీరాబాద్లో డ్రైనేజీ, తాగు నీటి సమస్యలుండేవని ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమీ లేవని అన్నారు.
భోలక్పూర్లో రూ. 23 కోట్లతో తాగునీటి, డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టామని, అదే విధంగదా అడిక్మెట్లో రూ. 1.30 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందజేశామని అన్నారు. రేషన్ కార్డులు లేని వారు మీ సేవలో ధరఖస్తు చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా ఈ నెల 31లోపు 57 ఏండ్లు నిండిన వారు పింఛన్ కోసం ధరఖాస్తు చేసుకోవాలని, ఇందుకోసం కార్యకర్తలు, నాయకులు దగ్గరుండి మీ సేవలో ధరఖాస్తు చేసుకునే విధంగా కృషి చేయాలని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు బస్తీదవాఖానల ఏర్పా టు, వీడీసీ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టామని అన్నారు.
అదే విధంగా సెప్టెంబర్ 2న డిల్లీలో తెలంగాణ భవన్ను ప్రారంభించి పార్టీ జెండాను ఎగురవేయడం జరుగుతుందని, ముషీరాబాద్ నియోజక వర్గంలోని ప్రతి డివిజన్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని అన్నారు. భోలక్పూర్, కవాడిగూడ, గాంధీనగర్, అడిక్మెట్ డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహ్మద్ అలీ, రాంచందర్, ఎర్రం శ్రీనివాస్గుప్తా, శ్యాంసుందర్, అడిక్మెట్ మాజీ కార్పొరేటర్ హేమలతారెడ్డి, టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, భోలక్పూర్ టీఆర్ఎస్ ఇన్చార్జి బింగి నవీన్కుమార్, ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాస్రావు, సీనియర్ నాయకులు వల్లాల శ్యామ్యాదవ్, పరశురామ్, నేత శ్రీనివాస్, ఆర్. మోజెస్ తదితరులు పాల్గొన్నారు.