కుత్బుల్లాపూర్/ మల్కాజిగిరి, ఫిబ్రవరి 9: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆటోడ్రైవర్లను ఆదుకొని చిత్తశుద్ధిని చాటుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు డిమాండ్ చేశారు. హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని ఆటోలో అసెంబ్లీకి వెళ్లారు.
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని, అయితే రోజూ ఆటోలకు గిరాకీ లేక డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మర్రి రాజ శేఖర్రెడ్డి అన్నారు. హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆయన అసెంబ్లీకి ఆటోలో ప్రయాణించారు. అలాగే ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలంటూ.. ప్లకార్డుతో ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం ఆటోలోనే అసెంబ్లీకి వెళ్లారు.