బంజారాహిల్స్, అక్టోబర్ 29: కాంగ్రెస్లో పని చేసే లీడర్లకే గ్యారంటీ లేదని, ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఎవరు నమ్ముతారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎద్దేవా చేశారు. పదేండ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో హ్యాట్రిక్ సాధిస్తామన్నారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా నియమితులైన బీఆర్ఎస్ సీనియర్ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేతో కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు అంటూ హడావిడి చేస్తున్న కాంగ్రెస్ను ప్రజలు నమ్మరని, బీఆర్ఎస్ 65 పథకాలు గ్యారంటీవన్నారు.
కర్నాటకలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ అక్కడి ప్రజలు రోడ్డు ఎక్కుతుంటే ఆ పార్టీ నేతలు ఇక్కడకు వచ్చి నీతులు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా బరిలోకి దిగిన అజారుద్దీన్కు క్రికెట్లో మంచి బ్యాట్స్మెన్గా పేరు ఉన్నదని, రాజకీయంలో పేరున్న బౌలర్ మాగంటి గోపీనాథ్ వేసే బాల్స్కు ఆయన వికెట్ పోవడం ఖాయమని నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి కట్టెల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సీఎన్.రెడ్డి, రాజ్కుమార్ పటేల్, దేదీప్యరావుతో పాటు బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.