జూబ్లీహిల్స్, జూలై 15 : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 24న యూసుఫ్గూడలోని కోట్లవిజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరం దేశంలోనే కొత్త రికార్డును నెలకొల్పనున్నదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గురువారం తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ప్రతినిధులతో కలిసి మెగా రక్తదాన శిబిరం నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. మూడు వేలమందితో నిర్వహించనున్న ఈ రక్తదాన శిబిరంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ ఇటీవల శివరాంపల్లిలోని రక్తమార్పిడి కేంద్రాన్ని కార్పొరేటర్లతో కలిసి సందర్శించగా.. లాక్డౌన్, కరోనా నేపథ్యంలో దాతలు లేక తలసీమియా వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్నారు. వారిని ఆదుకునేందుకే మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్పొరేటర్లు బాబాఫసియుద్దీన్, దేదీప్యరావు, సంగీతాయాదవ్, తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ప్రతినిధులు అలీమ్బేగ్, దుర్గాదేవి, మహ్మద్ జలీల్ పాల్గొన్నారు.