కేపీహెచ్బీ కాలనీ, జూలై 22 : వర్షాకాలం విపత్తులను ఎదుర్కొనేందుకు అత్యవసర బృందాలు సిద్ధంగా ఉండాలని, కాలనీలు, బస్తీల్లో చేపట్టిన అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. గురువారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో అభివృద్ధి పనులు, ముంపు సమస్యలు, హరితహారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ, రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వర్షాకాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరితే ఎప్పటికప్పుడూ తొలగించాలన్నారు. నియోజకవర్గంలో పార్కులు, చెరువుల సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
హరితహారంలో మొక్కలు నాటి కాపాడుకునే బాధ్యతను అందరూ తీసుకోవాలని ఎమ్మెల్యే కృష్ణారావు పిలుపునిచ్చారు. శనివారం మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమానికి జీహెచ్ఎంసీ సిబ్బంది సహకరించాలని కోరారు. కాలనీలు, బస్తీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు అందుబాటు లో ఉన్నాయని, స్థానిక ప్రజలు వాటిని ఉచితంగా తీసుకోవచ్చన్నారు. సమావేశంలో జడ్సీ మమత, ఎస్ఈ శంకర్ నాయక్, డీసీలు రవికుమార్, రవీందర్కుమార్, బయో అర్బన్ డైవర్సిటీ, ఇంజినీరింగ్ వి భాగం అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
చేపల మార్కెట్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని చేపల మార్కెట్ను ఎమ్మెల్యే కృష్ణారావు, జడ్సీ మమత అధికారులతో కలిసి పరిశీలించారు. మార్కెట్ భవనంలో గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని, ఎగ్జిట్ ఫ్యాన్లు బిగించాలని, చేపలను శుభ్రం చేసేందుకు బయట ప్రత్యేక షెడ్డును ఏర్పాటు చేయాలని చేపల విక్రయదారులు ఎమ్మెల్యేను కోరా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల మార్కెట్లో విక్రయదారులు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరమ్మతు పనులు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ ఈ శంకర్ నాయక్, డీసీ రవికుమార్, డీఈ శ్రీదేవి, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు, నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట, జూలై 22 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. డివిజన్ పరిధిలోని జ్యోతినగర్లో రూ 23 లక్షల వ్యయంతో డ్రైనేజీ పైపులైన్ పనులకు, అల్లాపూర్ సర్వే నెంబర్ 18లో రూ. 24.50 లక్షల వ్యయంతో ఓపెన్ నాలా అభివృద్ధి పనులు, రాజీవ్గాంధీనగర్లో రూ. 35 లక్షల వ్యయంతో మంచి నీటి పైపులైన్ పనులకు గురువారం స్థానిక కార్పొరేటర్ సబీహాబేగం, టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు గౌసుద్దీన్, జీహెచ్ఎంసీ అధికారులతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. అనంతరం రాజీవ్గాంధీనగర్లోని కమ్యూనిటీహాల్ మొదటి అంతస్తును ప్రారంభించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.