కేపీహెచ్బీ కాలనీ, జూన్ 30 : కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. బుధవారం కేపీహెచ్బీ కాలనీ, బాలాజీనగర్ డివిజన్లలోని పలు అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. బాలాజీనగర్ డివిజన్లోని కైత్లాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు నిర్మిస్తున్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేపీహెచ్బీ కాలనీ హైటెక్సిటీ మార్గంలో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే దిశగా కైత్లాపూర్లో ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జితో వర్షంనీటి ప్రవాహానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాలాలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. కేపీహెచ్బీ కాలనీ 15వ ఫేజ్లో నగరంలో ఎక్కడా లేని విధంగా చిన్న పిల్లలకు ఆహ్లాదాన్ని కలిగించే ప్రత్యేక పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కేపీహెచ్బీ కాలనీ 2, 3వ రోడ్డు, కాలనీ 3వ ఫేజ్లోని మహిళా పార్కు పనులు ఆలస్యం కావడంపై కాంట్రాక్టర్పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేయడం చేతకాకపోతే తప్పుకోవాలని సూచించారు. హౌసింగ్బోర్డు అధికారులు చేపట్టిన పనులు ఏండ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదని ఆ పనులను జీహెచ్ఎంసీకి అప్పగిస్తే వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు. కేపీహెచ్బీ కాలనీ ధనలక్ష్మీ సెంటర్లో వర్షంనీటి కాలువలను పునరుద్ధరించి రోడ్లపై నీటి నిల్వలు లేకుండా పనులు చేపట్టాలని, పార్కు అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని పేర్కొన్నారు. శ్యామ్ముఖర్జీ పార్కు వద్ద నాలాలో డ్రైనేజీ నీరు కలువకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
వసంతనగర్ కాలనీలోని బతుకమ్మ పార్కులో అసంపూర్తి పనులను పూర్తిచేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని, వసంతనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద నిర్మిస్తున్న తాగునీటి రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే కృష్ణారావు ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, పగడాల శిరీషాబాబూరావు, మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్, ఎస్ఈ శంకర్ నాయక్, డీఈ శ్రీదేవి, ఏఈ సాయిప్రసాద్, హౌసింగ్బోర్డు ఈఈ కిరణ్బాబు, ఏఈవో వాసు, కొండాపూర్ డీఈ గరత్మంతరాజు, ఏడీఈ శ్రీనివాస్రెడ్డి, ఆయా కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీ, జూన్ 30 : జూలై 6న బాలానగర్ ఫ్లై ఓవర్ను ప్రారంభించనున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలో ఏండ్ల తరబడి ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే దిశగా రూ.390 కోట్లతో ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించినట్లు వివరించారు. జూలై 6న ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జితో కూకట్పల్లి-సికింద్రాబాద్ మార్గంలో, జీడిమెట్ల-అమీర్పేట మార్గంలోని జంక్షన్లో ట్రాఫిక్ సమస్యలన్నీ తీరనున్నట్లు వెల్లడించారు. బాలానగర్ పరిసర ప్రాం తాలు, కూకట్పల్లి నియోజకవర్గ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.