Lasya Nanditha | కంటోన్మెంట్ : 2015లో మొదటిసారిగా లాస్యనందిత రాజకీయ రంగ ప్రవేశం చేసి కంటోన్మెంట్ బోర్డులోని నాలుగో వార్డు బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ కార్పొరేటర్గా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. 2021లో జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. లాస్యనందిత తండ్రి సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్యంతో అకాల మరణం చెందారు. ఈ క్రమంలో 2023 నవంబర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున తొలిసారిగా ఎమ్మెల్యేగా లాస్యనందిత గెలుపొందారు. అతి తక్కువ సమయంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించుకున్నారు. తండ్రి సాయన్న బాటలో నడుస్తూ.. పేదల పెన్నిధిగా ప్రజల మన్ననలు పొందారు.
ఎమ్మెల్యేగా లాస్యనందిత గెలుపొందిన నాటి నుంచి ఆమెకు ఇబ్బందులు చుట్టిమట్టాయి. గతేడాది డిసెంబర్ చివరి వారంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమానికి పాల్గొనేందుకు వచ్చి..లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. ఈ ఏడాది జనవరిలో అనారోగ్య సమస్యలతో వారం పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అలాగే ఫిబ్రవరి 13న నల్లగొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని వస్తూ.. నార్కట్పల్లి వద్ద కారుకు ప్రమాదం జరగడంతో ఎమ్మెల్యే లాస్యనందిత స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సరిగ్గా పదిరోజులకు శుక్రవారం తెల్లవారు జామున పటాన్చెరువు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.
సరిగ్గా ఏడాది కిందట ఫిబ్రవరి 19న ఎమ్మెల్యే సాయన్న చనిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఎమ్మెల్యే లాస్యనందితకు ప్రమాదం జరగడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యనందిత ప్రాణాలు కోల్పోయారు.