సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ): వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై గులాబీ జెండాను ఎగరవేద్దామని, ఆ దిశగా శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఎవరూ అధైర్యపడొద్దని, పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ నేతలు కాకమ్మ కథలు చెబుతున్నారనిఎద్దేవా చేశారు.
ఓడినా గెలిచినా.. బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజాపక్షమేనని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసే దాకా వెంటాడుతామని స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. లోక్ సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి సికింద్రాబాద్కు ఐదేండ్లలో ఏం చేశారో నిలదీయాలన్నారు.
కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే, కిషన్రెడ్డి సీతాఫల్మండి రైల్వేస్టేషన్లో లిఫ్ట్లను జాతికి అంకితం చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇదే ఆయన చేసిన అతిపెద్ద పని అని విమర్శించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 36 ఫ్లై ఓవర్లు కడితే ..ఉప్పల్, అంబర్పేట ఫ్లై ఓవర్లు సంవత్సరాలైనా.. కట్టలేక చేతులెత్తేశారన్నారు. బీఆర్ఎస్ వల్లే బీజేపీ సీనియర్ నాయకులు హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల్లో పోటీకి వెనుకంజ వేశారని, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకునే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్ధులై పనిచేయాలన్నారు.
త్వరలోనే జంజారాహిల్స్ రోడ్ నం. 12లో బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. ప్రతి మూడు నెలలకోసారి పార్లమెంట్ పరిధిలోని సన్నాహక సమావేశం, ప్రతి నెల నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుపుదామని చెప్పారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లో జిల్లాకు నూతన కమిటీలు వేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్ తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్యాదవ్, బాబా ఫసియుద్దీన్,
కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.