కేపీహెచ్బీ కాలనీ(హైదరాబాద్) : అన్నదాతకు అండగా నిలిచి, దళారి వ్యవస్థను నిర్మూలించిన ఘనత సీఎం కేసీఆర్దేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Mla Krishna Rao) అన్నారు. గురువారం కేపీహెచ్బీ కాలనీ రైతుబజార్లో కూకట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో తొమ్మిదేండ్ల కాలంలోనే రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించిందన్నారు.
అన్నంపెట్టే రైతన్నకు అండగా నిలుస్తూ రైతుబంధు(Raitu Bandu), రైతుబీమా లాంటి పథకాలతో ఆదుకుంటున్నారన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, కాళేశ్వరం(Kaleshwaram) లాంటి ప్రాజెక్టులను నిర్మించారని కొనియాడారు. రైతులు పండించిన పంటను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం దేశంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. రైతులు, వినియోగదారులకు మధ్య దళారి వ్యవస్థను నిర్మూలనే లక్ష్యంగా.. రైతుబజార్లు, మార్కెట్ కమిటీలు పనిచేస్తాయని తెలిపారు.
కూకట్పల్లి రైతుబజార్తో నిత్యం వందలాది మంది రైతులకు, వేలాది మంది వినియోగదారులకు మేలు జరుగుతుందన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి మార్కెట్ కమిటీలో భాగమైన కూకట్పల్లికి ప్రత్యేకమైన మార్కెట్ కమిటీని తీసుకురావడానికి సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు(Minister Harish Rao)తో పాటు అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో పనిచేసే ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్,కార్పొరేటర్లు , వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మహర్ష, డీఎంవో ఛాయాదేవి, మార్కెట్ కమిటీ కార్యదర్శి అశ్వక్ అహ్మద్ లు పాల్గొన్నారు.