కుత్బుల్లాపూర్, జనవరి 7 : అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా తనకు ప్రప్రథమ స్థానాన్ని కల్పించిన నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు పని చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపేందుకు వినూత్నంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదివారం నుంచి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ‘కృతజ్ఞత యాత్ర’ను చేపట్టారు.
మొదటి రోజున జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో అంగడిపేట్ విలేజ్, మీనాక్షిఎస్టేట్, స్ప్రీంగ్పీల్డ్ కానీ, జీడిమెట్ల విలేజ్, జయరాంనగర్, అయోధ్యనగర్, కుత్బుల్లాపూర్ విలేజ్లో తన యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి మంగళహారతులు, పువ్వులతో ఘనంగా స్వాగతం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన తొమ్మిదిన్నరేళ్ల కాలంలో తాను నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, ప్రజలతో తాను ఉన్న సత్సంబందాలే అని అన్నారు. తనను రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్న నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అవకాశంతో జీవితాంతం రుణపడి ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తాను ముందుండి పని చేసుకొని వారికి చేయూతను ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన మెజార్టీ మద్దతుతో మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఉత్సాహన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.