MLA KP Vivekanand | దుండిగల్, మార్చి 21 : తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ, గండిమైసమ్మలోని ‘మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం’ (జిల్లా తెలంగాణ భవన్)లో గురువారం బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేకానంద్ కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల్లో ఐదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసే నాయకుడు ఒక్కడైనా ఉన్నాడా..? అని ప్రశ్నించాడు. గడిచిన పదేండ్ల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పది రాష్ర్టాల ప్రభుత్వాలను కూల్చివేయడం తప్ప ప్రజలకు చేసిందేమిటని ప్రశ్నించారు. తమ స్వార్థం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పనిచేస్తే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. త్వరలో మల్కాజిగిరి ఎంపీ స్థానానికి జరుగనున్న త్రిముఖ పోరులో బీఆర్ఎస్దే విజయమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గత 20 ఏళ్ళ కాలంలో పలు బస్తీలు, కాలనీలల్లో ‘మధుర ట్రస్ట్’పేరుతో ఉచిత వైద్య శిబిరాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, ప్రజలకు సేవ చేసే నాయకుడే రావాలని, ఎన్నికలప్పుడు హెలికాప్టర్లలో వచ్చి హాయ్.., బాయ్ చెప్పే నాయకులు అవసరం లేదన్నారు. స్థానికంగా మన నాయకుడు మనకు ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. కొడంగల్లో ఓడిపోయి మల్కాజిగిరిలో గెలిచిన రేవంత్రెడ్డి ప్రజలకు చేసిందేమిలేదన్నారు. హుజురాబాద్లో ఓడిన ఈటెల రాజేందర్ మల్కాజిగిరిలో గెలిచినా చేసేది ఏమీ లేదన్నారు. అంతకు ముందు రాగిడి లక్ష్మారెడ్డి కార్యకర్తలు, నేతలకు పరిచయం చేసుకున్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి బాటలు వేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సన్నశ్రీశైలంయాదవ్, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్, నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్కృష్ణ, నిజాంపేట్ కార్పొరేషన్ సీనియర్ బీఆర్ఎస్ నేత కొలన్ గోపాల్రెడ్డి, ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నాయకులు, కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిల్లకు చెందిన పలువురు కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్తో కలిసి సూరారం కట్టమైసమ్మ ఆలయం, దుండిగల్లోని సింగాపురం మైసమ్మదేవాలయాల్లో పూజలు చేశారు.