కుత్బుల్లాపూర్, మే 30 : ఇటీవల బీజేపీ పార్టీ నాయకులు చేపట్టిన సభ ప్రజల భరోసా కోసం కాదని.. వారి రాజకీయ ఉనికి కోసం చేపట్టిన గోస అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 132 జీడిమెట్ల డివిజన్ సరోజిని గార్డెన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.. వ్యూహం మేరకే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని ప్రజలకు చాటి చెప్పాలే ప్రతి రోజు నియోజకవర్గంలో ప్రగతియాత్ర పేరుతో ప్రజల వద్దకు వెళ్తుంటే అపూర్వ ఆదరణ లభిస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనే ముందు వరుసలో నిలిచేలా అనునిత్యం ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ సత్వరమే పరిష్కరించే వేదికగా చక్కటి కార్యక్రమం ప్రగతియాత్ర అని అన్నారు.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వస్తూ పోతుంటాయని, అనునిత్యం, చిరస్థాయిగా ప్రజల్లో నిలిచే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అని ఆయన అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఎవరు గోస పడుతలేరని, గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ఆరున్నర వేల కోట్లతో అడుగడుగునా అభివృద్ధి చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జరగబోయే ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని, పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సోషల మీడియా ద్వారా మరింత విస్తృతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్రావు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంపతి మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, జ్ఞానేశ్వర్ముదిరాజ్, పెద్ది మల్లేశం, మురళి, సమ్మయ్య, కాలే నగేశ్, జైపాల్, అరుణారెడ్డి, యేసు, బీరప్ప, గోవర్ధన్రెడ్డి, కృష్ణముదిరాజ్, విజయ్కృష్ణతో పాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.