అంబర్పేట/ కాచిగూడ, జూలై 31 : అంబర్పేట ప్రజల కొంగు బంగారం…అందరి కోర్కెలు తీర్చే మహంకాళి అమ్మవారి బోనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు, రేపు రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా బోనాల జాతరను నిర్వహించేందుకు అంబర్పేట దేవస్థాన సేవా సమితి ప్రతినిధులు అన్ని చర్యలు తీసుకున్నారు. జూలై 18వ తేదీన ఘటం ఊరేగింపుతో బోనా లు ప్రారంభమయ్యాయి. 31వ తేదీ వరకు ఘటం అన్ని బస్తీలలో తిరిగింది. నేడు ఆదివారం ఉదయం 4 గంటల నుంచి 6 వరకు అమ్మవారికి అభిషేకము నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆగస్టు 2వ తేదీ సోమవారం తెల్లవారు జామున 3 గంటల నుంచి అమ్మవారి ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి నూతన వస్ర్తాలు తెచ్చుట, ఒంటి గంటకు పచ్చికుండ స్థాపన, 2 గంటలకు ఏర్పుల విజయ్కుమార్చే భవిష్యవాణి (రంగం) కార్యక్రమం ఉంటుంది.
3 గంటలకు పోతరాజుల ప్రదక్షణ, సాయంత్రం 4 గంటలకు బలిగంప తీయుట, 6 గంటలకు అమ్మవారి సాగనంపు ఊరేగింపుతో బోనాల రెండు రోజుల జాతర పూర్తవుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థాన సేవా సమితి అధ్యక్షుడు జె.సత్తిబాబు, ఉపాధ్యక్షుడు పి.చంద్రశేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీరాములుముదిరాజ్, కార్యదర్శి చెంగలి సుధాకర్, కార్యనిర్వాహక కార్యదర్శి గడ్డం శ్రీధర్గౌడ్, కోశాధికారి వి.మహేందర్రెడ్డి తదితరులు చెప్పారు. హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, ఎం. అంజన్కుమార్యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తదితరులు హాజరుకానున్నారు.
కాచిగూడ : అతి పురాతనమైన 236 సంవత్సరాల చరిత్ర గల నింబోలిఅడ్డ మహంకాళి దేవాలయంలో నేడు, రేపు జరిగే బోనాలను పురస్కరించుకుని నిర్వాహకులు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా మహంకాళి అమ్మవారు నిత్య పూజలు అందుకుంటున్నది. నింబోలిఅడ్డలో నివసించే పటేల్ జంగులుగౌడ్ అనే వ్యక్తికి అమ్మవారు కలలో కనబడి తనకు ఆలయం నిర్మించాలని ఆదేశించగా పటేల్ జంగులు దర్బారు మైసమ్మ ఆలయాన్ని నిర్మించారు. ప్రజలు ప్రతి సంవత్సరం బోనాల ను అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన పటేల్ జంగులు వంశీయుడైన వారి మునిమనమడు రాజేందర్ పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటారు. నేటి నుంచి జరుగు బోనాల ను వైభవంగా జరిపించాడానికి సన్నాహాలు చేశారు. ఆదివారం బోనాలను చూడడానికి నగరంలోని నలు మూలల నుంచి వేలాది మంది ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించు కుంటారు. ఇతరరాష్ర్టాల నుంచి వచ్చిన కళాకారులు మూడు రోజుల పాటు జానపద గీతాలు పాడుతూ సంబురాలు నిర్వహిస్తారు.