ఎల్బీనగర్, మే 8: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి శుక్రవారం జలమండలి ఎండీ అశోక్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కోరారు. చంపాపేట, బీఎన్రెడ్డినగర్, సరూర్నగర్ చెరువు ప్రాంతాల్లోని సమస్యలను అశోక్రెడ్డి దృష్టికి తెచ్చారు. చంపాపేట డివిజన్ కర్మన్ఘాట్ క్రాంతినగర్ కాలనీలో బోర్వెల్ విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరణ చేయించాలని కోరారు.
కాలనీలో సుమారు 300 కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరిలో అధిక సంఖ్యలో పేద, మధ్యతరగతి ప్రజలు ఉన్నారని అన్నారు. నీటి సమస్య కారణంగా ప్రజలు బోర్ నీటిపై వేసవిలో ఆధారపడుతున్నారని, అయితే బోర్వెల్కు సంబంధించిన విద్యుత్ బిల్లులు రూ. 6,38,641 బకాయిల కారణంగా విద్యుత్ శాఖ వారు నోటీసులు జారీ చేశారన్నారు. గతంలో ఈ బోర్ నిర్వహణ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సమయంలో విద్యుత్ బిల్లులు జీహెచ్ఎంసీ వారే చెల్లించే వారని, దీనిని జలమండలి పరిధిలోకి తీసుకున్న మీదట విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతోనే బకాయిలు పెరిగిపోయాయని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అశోక్రెడ్డి దృష్టికి తెచ్చారు.
ఈ బిల్లులను కాలనీవాసులనే చెల్లించాలంటూ విద్యుత్ శాఖ వారు ఒత్తిడి తెస్తున్నారని, అలా కాకుండా కాలనీవాసుల నీటి అవసరాలు తీరే విధంగా జలమండలి వారే ఈ విద్యుత్ బకాయిలను చెల్లించి నీటి బోర్ పునరుద్ధరణ చేయాలని కోరారు. బీఎన్రెడ్డినగర్లోని సాగర్ కాంప్లెక్స్ పరిసరాల్లోని ట్రంక్లైన్ మంజూరు చేసి సమస్యలను పరిష్కారించాలన్నారు. సాగర్ కాంప్లెక్స్ నుంచి వచ్చే డ్రైనేజీ నీరు అవుట్లెట్ లేక గుర్రంగూడ ఫారెస్ట్, హరిహరపురం కాలనీల్లోకి చేరుతూ స్థానికంగా ఫారెస్ట్లోఉన్న రెండు చెరువులు కలుషితం అవుతున్నాయని తెలిపారు. నూతన ట్రంక్లైన్ మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.
సరూర్నగర్ చెరువులో నీటితో పాటుగా చెరువులో చేరుతున్న నీరు కాలుష్యాన్ని నుంచి మెరుగు పరిచేందుకు ప్రస్తుతం చెరువులో ఉన్న 2.5 ఎంఎల్డీ సామర్థ్యం ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్ స్థానంలో 10 ఎంఎల్డీ ట్రీట్మెంట్ ప్లాంట్ను పెంచాలని అశోక్రెడ్డిని కోరారు. ట్రీమ్మెంట్ ప్లాంట్ సామర్థ్యం పెంచడం ద్వారా చెరువులో నీటి కాలుష్యంతో పాటుగా దుర్వాసన తగ్గి నీటి నాణ్యత మెరుగుపడి పరిసర కాలనీల వాసులకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.
అదే విధంగా నియోజకవర్గంలోని శివారు ప్రాంతాల డ్రైనేజీ, తాగునీటి సమస్యలను తొలగించాలని కోరారు. జలమండలి ఎండీ అశోక్రెడ్డి అన్ని అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేస్తామని సుధీర్రెడ్డికి హామీ ఇచ్చారు. ఆయన వెంట బీఎన్రెడ్డి డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, చంపాపేట డివిజన్ నాయకుడు గండికోట శ్రీనాధ్, కాలనీల వాసులు ఆనంద్, దివాకర్, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.