మన్సూరాబాద్, జూన్ 7: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అర్హులైన వారికి అందజేస్తున్నారని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. నాగోల్ డివిజన్ పరిధి ఎరుకుల నాంచారమ్మ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలోని కొంత మంది నిర్వాసితులకు సోమవారం ఆయన పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురికివాడలు లేని నగరంగా హైదరాబాద్ను సీఎం కేసీఆర్ తీర్చిదిద్ధుతున్నారని తెలిపారు. గ్రేటర్ పరిధిలో రూ.9,714 వేల కోట్లతో నగరంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి కావచ్చాయని తెలిపారు. రెండు నెలల్లో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు సొంతం కానున్నాయని ఆయన తెలిపారు.
నిర్మాణాల్లో నాణ్యతకు పెద్దపీట వేశారని.. అధునాతనమైన సాంకేతిక నైపుణ్యంతో కూడిన లిఫ్ట్లను అమర్చడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో నివసించే వారు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. నివాసితులు ఓ కమిటీని ఏర్పాటు చేసుకుని ప్రతినెల మెయింటెనెన్స్ చార్జీలను వసూలు చేసుకొని కాలనీ నిర్వాహణ బాధ్యతను చూసుకోవాలని ఆయన తెలిపారు. లబ్ధిదారులకు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే తమ వాహనాలను నిలుపుకుని ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.