ఎల్బీనగర్, మే 20 : కరోనా మహమ్మారి కుటుంబాలనే బలి తీసుకుంటోంది. ఒకే కుటుంబంలో పెద్ద దిక్కుతో పాటుగా తల్లిదండ్రులనూ కరోనా కాటు వేయడంతో ఆ ఇంట్లో చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. తుర్కయాంజాల్ మన్నెగూడ ప్రాంతానికి చెందిన గోపాల్రెడ్డి, ఆయన భార్య దీప, ఆయన తల్లి భారతమ్మలు కరోనా బారిన పడి పదిహేను రోజుల వ్యవధిలోనే మృత్యవాత పడ్డారు. దీంతో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. గత 20 రోజుల క్రితం భారతమ్మతో పాటుగా అమె కుమారుడు గోపాల్రెడ్డి, కోడలు గీతలకు కరోనా సోకింది. కరోనాతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 15 రోజుల క్రితం భారతమ్మ మృతి చెందగా, తల్లి చనిపోయిన మూడు రోజులకు అమె కుమారుడు గోపాల్రెడ్డి , అతని భార్య దీప కూడా కరోనా చికిత్స పొందుతూ మరణించారు. దీంతో వారి చిన్నారులు సాత్విక్, హాన్వీలు అనాథలుగా మారారు. వీరూ ప్రస్తుతం హస్తినాపురం డివిజన్ పరిధిలోని అనుపమ నగర్ కాలనీలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అనుపమనగర్కు వెళ్లి చిన్నారులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి చిన్నారులకు అండగా ఉంటామని హమీ ఇచ్చారు