మన్సూరాబాద్, సెప్టెంబర్ 28: ఫతుల్లాగూడలో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న మహాప్రస్తానం పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ ఫతుల్లగూడలో ఆరు ఎకరాల స్థలంలో రూ. 18 కోట్ల వ్యయంతో హిందూ, ముస్లిం, క్రైస్తవుల కోసం నిర్మిస్తున్న శ్మశానవాటిక పనులను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువుల శ్మశాన వాటిక ప్రాంగణంలో అపరకర్మలు నిర్వహించుకునేందుకు బ్రాహ్మణుల కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహా ప్రస్థానంలో విశాలమైన హాల్తో పాటు స్నానాల గదులు, మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్మశానవాటికలో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించి చక్కని వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెరుకు ప్రశాంత్గౌడ్, అనంతుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.