వనస్థలిపురం : నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం హస్తినాపురం డివిజన్లోని పలు కాలనీల్లో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీమా నగర్ నుంచి హుడా భారతీనగర్ వరకు ట్రంక్ లైన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. సాగర్ ఎన్క్లేవ్ కాలనీ వద్ద వరదనీరు వెళ్లేందుకు ప్రత్యేక లైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఆయా కాలనీల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు.ప్రజా ధనం వృథా కాకుండా సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్, మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్, ఎస్ఈలు రవీందర్రెడ్డి, అశోక్రెడ్డి, డీఈలు కార్తిక్, రమేష్బాబు, నాయకులు డేరంగుల కృష్ణ, రఘుమారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.