బంజారాహిల్స్, డిసెంబర్ 3 : ఖైరతాబాద్ గడ్డపై మరోసారి దానం నాగేందర్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇది రెండోసారి విజయం కాగా, భారీ మెజార్టీ అందుకున్నారు. తొలి రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి స్వల్ప మెజార్టీతో ముందుకు రాగా, మరో రౌండ్ నుంచి వెనక్కి పడిపోతూ వచ్చారు. అనంతరం బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి పలు రౌండ్లలో ముందుకు వచ్చేందుకు ప్రయత్నించి బోల్తా పడ్డారు. నాలుగు, ఐదో రౌండ్ తర్వాత దానం నాగేందర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ప్రతి రౌండ్లోనూ ముందంజలో నిలిచారు. గట్టి పోటీ ఇస్తారని భావించిన కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి, బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిలు రెండోస్థానం కోసం పోటీపడగా, ఆ స్థానాన్ని విజయారెడ్డి దక్కించుకున్నది. మూడో స్థానంలో చింతల రామచంద్రా రెడ్డి నిలిచారు. ఈ పోటీలో దానం నాగేందర్కు 67,165 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డికి 45,061, బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డికి 37,931 ఓట్లు వచ్చాయి.
దానం నాగేందర్ 22,104 మెజార్టీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా, దానం నాగేందర్కు మెజార్టీ పెరుగుతుండటంతో పదో రౌండ్ ముగిసిన తర్వాత విజయారెడ్డి ఓటమిని గ్రహించి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిపోయారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత దానంను అభినందించేందుకు వేలాదిగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు.
జై తెలంగాణ, జై డీఎన్ఆర్ నినాదాలతో కౌంటింగ్ కేంద్రం వద్ద అభిమానులు, కార్యకర్తలు హోరెత్తించారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత దానం నాగేందర్కు ఎన్నిక పత్రాన్ని రిటర్నింగ్ అధికారి వెంకటేశ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు వెల్దండ వెంకటేశ్, మన్నె కవిత, వనం సంగీత యాదవ్, మహాలక్ష్మి రమన్గౌడ్, మాజీ కార్పొరేటర్లు కాజా సూర్యనారాయణ, భారతినాయక్, బీఆర్ఎస్ సీనియర్ నేతలు రామన్గౌడ్, మామిడి నర్సింగరావు, వివిధ డివిజన్ల అధ్యక్షులు రాములు చౌహాన్, ఎస్కె అహ్మద్, ప్రవీణ్కుమార్, పలు డివిజన్ల నాయకులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఈసారి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆ మూడు పార్టీల తప్ప మిగతా వారిలో చాలా మందికి రెండంకెలు కూడా దాటలేదు. దీంతో అనేక మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి.
బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపును బీఆర్ఎస్ శ్రేణులు వేడుకగా జరుపుకున్నారు. కౌంటింగ్ కేంద్రమైన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం యూసుఫ్గూడ చెక్పోస్టు మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా నిలబడి దానంకు నీరాజనాలు పలికారు. దానం విజయ సంకేతాన్ని చూపిస్తూ ముందుకు సాగారు. భారీ ర్యాలీ నిర్వహించి పటాకులు కలిసి సంబురాలు చేసుకున్నారు.