బంజారాహిల్స్, ఏప్రిల్ 16: బంజారాహిల్స్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ‘నజరానా’ నిజమేనని తేలింది. తానేదో ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతున్నానంటూ ఏకంగా రేకుల షెడ్లతో ఆక్రమించి.. బుకాయించినా.. ఆక్రమణ నిజమేనని రుజువైంది. దానం నజరానా నిజమేనని షేక్పేట రెవెన్యూ యంత్రాంగం మంగళవారం తేల్చేసింది. ఈ మేరకు షెడ్లను, అందులో దానం నాగేందర్కు సంబంధించి ఉన్న సామగ్రిని తొలగించి, స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్లో దానం నాగేందర్ నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వెనకాల ఉన్న 700 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు ఇటీవల ’ఫిరాయింపునకు నజరానా’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు తాజాగా ఆక్రమణల్ని తొలగించి, జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించారు.
షేక్పేట మండలం సర్వే నంబర్. 403లోని టీఎస్ నం. 4/1/1/ సీ, బ్లాక్ -డీ లోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్ నం. 3లోని కంగారూ స్కూల్ ఎదురుగా సుమారు 3050 గజాల ప్రభుత్వ స్థలాన్ని మూడేళ్ల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రముఖ సినీ రచయిత డా. సీ నారాయణ్రెడ్డి పేరుతో భవన్ నిర్మాణం కోసం బాషా సాంస్కృతికశాఖకు కేటాయించింది. అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన సైతం చేసినా.. వివిధ కారణాలతో భవన నిర్మాణం ప్రారంభం కాలేదు. ఈ స్థలం వెనకాల సుమారు 400 గజాల ప్రభుత్వ ఖాళీ స్థలం ఉంది. కాగా, సినారే భవన్కు, ఎమ్మెల్యే దానం నాగేందర్ నివాసానికి మధ్య సుమారు 30 ఫీట్ల వెడల్పుతో సుమారు 200 ఫీట్ల పొడువుతో అప్రోచ్ రోడ్డు ఉంది. ఈ రహదారి నుంచే వెనకాల ఉన్న 400 గజాల స్థలంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోడ్డుకు రెండు వైపులా ఇటీవల ఎమ్మెల్యే దానం నాగేందర్ బ్లూ షీట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఏకంగా సినారే భవన్ వైపు సిమెంట్ బ్రిక్స్తో గోడ, ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు.
తన ఇంటి నిర్మాణ పనులు జరుగుతుండటంతో నిర్మాణ సామగ్రి, ఇతర వస్తువులు పెట్టేందుకు రోడ్డుకు రెండువైపులా బ్లూషీట్లు ఏర్పాటు చేశానని, నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత వాటిని తొలగిస్తానంటూ నెలరోజులుగా ఎమ్మెల్యే దానం నాగేందర్ చెబుతూ.. వస్తున్నారు. అయితే నెలరోజులు దాటినా.. వాటిని తొలగించకపోవడంతో పాటు ఈ వ్యవహారంపై మీడియాలో కేటీఆర్ వ్యాఖ్యలతో రంగంలోకి దిగిన షేక్పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి ఆధ్వర్యంలో అక్రమంగా ఏర్పాటు చేసిన బ్లూ షీట్లను తొలగించడంతో పాటు సర్వెంట్స్ కోసం ఏర్పాటు చేసిన షెడ్లను కూల్చేశారు. సుమారు 750 గజాల స్థలంలో పెట్టిన ఎమ్మెల్యే దానం నాగేందర్కు చెందిన సామగ్రిని ఆయన ఇంట్లోకి పంపించే శారు. ఆక్రమణలను తొలగించి రోడ్డు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని, హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు నివేదిక పంపించామని షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి తెలిపారు.