బంజారాహిల్స్, మే 30: బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఉదయ్నగర్, సింగాడకుంట ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పదిరోజుల్లోగా పూర్తి చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్ఎంసీ. జలమండలి అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానికుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే దానం నాగేందర్ పాదయాత్ర నిర్వహించారు. కొన్ని వీధుల్లో సీసీ రోడ్లు పాడయ్యాయని స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే ప్యాచ్వర్క్ చేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉదయ్నగర్ బస్తీల్లోని పలు ప్రాంతాల్లో వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, పెండింగ్ పనులను పదిరోజుల్లోగా పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.
సరస్వతి స్కూల్ సమీపంలో మురుగు సమస్యల పరిష్కారం కోసం కొత్త సీవరేజీ లైన్ పనులను ఎమ్మెల్యే దానం ప్రారంభించారు. సింగాడకుంట, ఉదయ్నగర్లలోని కొన్ని వీదుల్లో విద్యుత్ కేబుళ్లు ప్రమాదకరంగా ఉన్నాయని స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే ఆయా ప్రాంతాల్లో విద్యుత్ కేబుళ్ల స్థానంలో బంచ్ కేబుల్స్ ఏర్పాటు చేయాలని విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. బస్తీలోని కొన్ని చోట్ల వీధి దీపాలు సరిగా వెలగడం లేదని స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే కొత్త స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో నాలా మీద స్లాబ్ వేయకుండా జాలీ ఏర్పాటు చేయడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. పెండింగ్ పనులన్నింటినీ పదిరోజుల్లోగా
పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ఉదయ్నగర్ బస్తీలో ఇండ్లను కూల్చడానికి వస్తే గతంలో తాను అడ్డుపడి బస్తీని కాపాడానన్నారు. ఎన్నికల సమయంలో వచ్చేపార్టీని నమ్మవద్దని, నిరంతరం ప్రజలకు అవసరమయ్యే సంక్షే మ పథకాలను అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం హరిశంకర్, జీహెచ్ఎంసీ అధికారులు విజయ్కుమార్, స్థానిక నేతలు జెట్టి విజయ్కుమార్, ప్రేమ్ , సింగాడకుంట బస్తీ అధ్యక్షుడు ఎజాజ్, నజీర్, శంకర్, స్వామి, వెంకటయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.