బంజారాహిల్స్/బేగంపేట్/హిమాయత్నగర్/అమీర్పేట్, డిసెంబర్ 23: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం ఆలయాలన్నీ గోవింద నామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజామునుంచే ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాల కోసం భక్తులు పోటెత్తారు. జూబ్లీహిల్స్లోని టీటీడీ ఆలయంలో విశేష పూజలు ప్రారంభమయ్యాయి. వేలాదిగా వచ్చిన భక్తులు ఉత్తర ద్వారం గుండా గోవింద నామస్మరణతో స్వామివారి దర్శనం చేసుకున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నం.14లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సినీ హీరో కల్యాణ్రామ్ స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, బంజారాహిల్స్ రోడ్ నం. 1లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేలాదిమంది భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కేశవరావుతోపాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్వామివారి దర్శనం చేసుకున్నారు.
రాంగోపాల్పేట్, బేగంపేట్లోని దేవాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్పీ రోడ్డులోని హనుమాన్ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాస్రెడ్డి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బేగంపేట్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి స్వామివారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా హిమాయత్ నగర్లోని టీటీడీ బాలాజీ భవన్ గోవింద నామస్మరణతో మార్మోగింది. హిమాయత్నగర్, లిబర్టీ పరిసర ప్రాంతాలు భక్త జన సంద్రంగా మారాయి. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాటు పలువురు ప్రముఖు లు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ డిప్యూటీ ఈవో రమేశ్బాబు నేతృత్వంలో టీటీడీ వలంటీర్లు భక్తులకు సేవలు అందించారు.
భగవంతుని ఆశీర్వాదంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించాలని వేంకటేశ్వరస్వామిని కోరుకున్నానని హిమాయత్నగర్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి రామన్గౌడ్ తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం హిమాయత్నగర్,లిబర్టీలోని టీటీడీలో వేంకటేశ్వరస్వామిని ఆమె దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలోబీఆర్ఎస్ నాయకులు జి.రామన్గౌడ్, అనీశ్గంగపుత్ర,శేఖర్,జైస్వాల్ పాల్గొన్నారు.