చర్లపల్లి, డిసెంబర్ 15 : ఉప్పల్ నియోజకవర్గం( Uppal) సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy) పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని సాయినగర్లో రూ.18లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఏఈ స్వరూపలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా అధికారులు పనులను పరిశీలించాలని ఆయన సూచించారు.
అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, డివిజన్లలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సాయినగర్ కాలనీవాసులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ధన్పాల్రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, కాలనీ అధ్యక్షుడు సారా వినోద్, తదితరులు పాల్గొన్నారు.