మియాపూర్, జూలై 19: విద్యాసంస్థల ఆవరణలు పచ్చదనంతో నిండేలా మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలని, తద్వారా పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం విద్యార్థులల్లో విద్యాసక్తిని పెంపొందిస్తుందని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. విద్యార్థి దశ నుంచి ఈ పచ్చని ఉద్యమంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని, భవిష్యత్ ఆరోగ్యకరంగా మారుతుందన్నారు. 7వ విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదర్నగర్లోని శేరిలింగంపల్లి మండల మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల కళాశాల ఆవరణలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పాఠశాల సిబ్బందితో కలిసి విప్ గాంధీ సోమవారం మొక్కలను నాటారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఆయన అందించారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం మైనార్టీ గురుకులాలను తీర్చిదిద్దుతున్నదని, చక్కని వసతులు, నాణ్యమైన విద్య, భోజనం వంటివి పేద విద్యార్థులకు అందిస్తున్నదన్నారు. ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చదువుతో పాటు ఆయా అంశాలలో తమ సత్తాను చాటుతుండటం అభినందనీయమన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ నాణ్యమైన విద్యా సౌకర్యాలను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పాఠశాల ఆవరణలో ప్రతి విద్యార్థి చేత మొక్కను నాటించి వాటి సంరక్షణ బాధ్యతను వారికి అప్పగించాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు. పచ్చదనం లోపిస్తుండటం వల్ల వస్తున్న అనర్థాలను గుర్తించి ప్రతి ఒక్కరు ఈ పచ్చని ఉద్యమంలో భాగస్వాములు కావాలని విప్ గాంధీ కోరారు. ప్రస్తుత తరాలు నాటే మొక్కలే భవిష్యత్ తరాలకు ఢోకా లేకుండా చేస్తాయని విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రారెడ్డి, పాఠశాల సిబ్బంది, పార్టీ నేతలు దామోదర్రెడ్డి, రాజేందర్, అషఫ్,్ర ఖదీర్, షరీఫ్, యాసిన్, పర్వీన్ సుల్తానా, మాధవి తదితరులు పాల్గొన్నారు.