మియాపూర్, జూలై 17 : 20 వేల లీటర్ల వరకు తాగునీటిని వినియోగించుకునే ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్నదని, పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రకటించిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ కోరారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గాను అర్హులైన లబ్ధిదారులంతా ఆగస్టు 15 వరకు తమ నల్లా కనెక్షన్కు ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని, విధిగా మీటరును బిగించుకోవాలని ఆయన సూచించారు.
మియాపూర్లోని తన క్యాంపు కార్యాలయంలో హఫీజ్పేట్, కూకట్పల్లి జలమండలి డివిజన్ అధికారులతో ఉచిత తాగునీటి పథకంపై శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు రాగం నాగేందర్యాదవ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, గంగాధర్రెడ్డి, సింధుఆదర్శరెడ్డి, మంజులా రఘునాథ్రెడ్డి, మాధవరం రోజాదేవిలతో కలసి ఉచిత తాగునీటి పథకంపై విస్తృత ప్రచారానికి రూపొందించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. ఆధార్ అనుసంధానం, మీటరు బిగించుకున్న లబ్ధిదారులకు గతేడాది డిసెంబరు నుంచి ఈ యేడాది ఆగస్టు 31 వరకు 20 వేల లీటర్ల వరకు నల్లా బిల్లు పూర్తిగా మినహాయింపు లభిస్తుందన్నారు. జలమండలి కార్యాలయాల్లో రూ. 1300 లకు మీటరు బిగింపునకు అదనంగా రూ.200 చార్జీలను వసూలు చేస్తారని విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా సెక్షన్ల జీఎంలు రాజశేఖర్, ప్రభాకర్, డీజీఎంలు నాగప్రియ, వెంకటేశ్వర్లు, నారాయణ, మేనేజర్లు సుబ్రమణ్యం, వెంకటరెడ్డి, విప్పర్తి, సందీప్, ప్రశాంతి, ప్రియ, ఝాన్సి, పార్టీ నేతలు రంగారావు, వీరేశం పాల్గొన్నారు.