వేసవి కాలన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటికి ఎద్దడి రాకుండా చూడాలని, అదనంగా వేసవి ప్రణాళికతో ప్రజలకు నీటిని పూర్తిస్థాయిలో అందించేందుకు సంసిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరాను నియోజకవర్గంలో అర్హుడైన ప్రతి లబ్దిదారుకు దరిచేర్చాలని అధికారులను ఆదేశించారు. మియాపూర్లోని క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివారావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మాధవరం రోజాదేవి, మంజూలరెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, మాధవరం రంగారావుతో పాటు జలమండలి అధికారులతో విప్ అరెకపూడి గాంధీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్విహించారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం కింద నియోజకవర్గవ్యాప్తంగా 18 రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని అందుబాటులోకి తీసుకువచ్చామని, అన్ని కాలనీల్లో పైప్లైన్ల విస్తరణను చేపట్టినట్లు విప్ పేర్కొన్నారు. కొత్తగా విస్తరించిన కాలనీల్లోనూ పైప్లైన్లను చేపట్టాలని, పైప్లైన్ల లీకేజీను తక్షణమే గుర్తించి పూర్తిస్థాయి మరమ్మతులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రతి గడపకు స్వచ్ఛమైన తాగునీరు అందించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్క నీటి బొట్టుకూడా వృథాగా పోకుండా పకడ్బందీ చర్యలను జాప్యం లేకుండా చేపట్టాలని విప్ గాంధీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీఎం రాజశేఖర్,డీజీఎం శ్రీమన్నారాయణ, డీజీఎం వెంకటేశ్వర్లు, నాగప్రియ తదితరులు పాల్గొన్నారు.