మియాపూర్, జూన్ 22 : ప్రభుత్వం ఎన్నికల ముందు ఉచిత తాగునీటి పథకాన్ని ప్రకటించిందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నాలు ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకాన్ని అర్హులైన ప్రతి వినియోగదారుడికి లబ్ధి కలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వివేకానందనగర్లోని తన నివాసంలో భాగ్యనగర్ సెక్షన్ జలమండలి అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ధారిత నీటి వినియోగ లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో గుర్తించి ప్రక్రియను పూర్తి చేయించాలన్నారు.
వానకాలం నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ తాగునీటి పైపుల లీకేజీలను గుర్తించి కలుషితానికి ఏమాత్రం అవకాశం లేకుండా చూడాలన్నారు. మిషన్ భగీరథ పథకం కింద నియోజకవర్గవ్యాప్తంగా 18 రిజర్వాయర్లను ఏర్పాటు చేశామని, సింహభాగం పైపులైన్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని, ఇంకా నెట్వర్క్ అవసరమైన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలను సమర్పించాలని విప్ గాంధీ సూచించారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పని చేస్తూ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్లు ప్రశాంతి, ప్రియాంక, శాంతి పాల్గొన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ ఆల్విన్ కాలనీ ఫేజ్ 2కు చెందిన దేవీకి సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ. 16 వేల ఆర్థిక సాయం చెక్కును ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మంగళవారం తన నివాసంలో లబ్ధిదారురాలికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నదన్నారు. అనారోగ్యం పాలై ఆర్థిక ఇబ్బందులలో ఉన్న నిరుపేదలకు ఈ పథకం సంజీవనిలా ఉపయోగపడుతున్నదని, కొండంత అండగా నిలుస్తున్నదని ఆయన వెల్లడించారు.
కొండాపూర్, జూన్ 22 : శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని చందానగర్ డివిజన్లో బుధవారం రూ. 2.15 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులను డివిజన్ కార్పొరేటర్ మంజుల రెడ్డితో కలిసి ప్రారంభించనున్నట్లు తెలిపారు.