మియాపూర్, అక్టోబరు 31 : స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు కావటం పట్ల శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఆయనపై పెట్టిన కేసులేవి నిలబడవని, మచ్చలేని వ్యక్తిగా బాబు బయటకు వస్తారన్నారు. ఈ మేరకు మంగళవారం విప్ గాంధీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ బాబును అభిమానించే తన లాంటి వారితో పాటు వేలాది మంది అభిమానులకు ఇదో శుభవార్త అన్నారు. న్యాయం తప్పకా గెలుస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నియోజకవర్గంలో ఆయన అభిమానులు చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో తాను చురుగ్గా పాల్గొన్నానని, అక్రమ అరెస్టును ముక్త కంఠంతో ఖండించినట్లు తెలిపారు.
చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా పోరాడిన ప్రతి ఒక్కరికీ విప్ గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ పార్టీ సైతం తొలినుంచి బాబు అరెస్టును ఖండించిందని గుర్తు చేశారు. త్వరలోనే కేసుల నుంచి పూర్తి ఉపశమనం పొంది ఎటువంటి మచ్చలేని నేతగా చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.