సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ ఫలాలను నగర శివారు ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. శివారు ప్రాంత ప్రజలకు పక్కాగా తాగునీటిని సరఫరా చేయాలనే సంకల్పంలో భాగంగా జీహెచ్ఎంసీ వెలుపల నుంచి ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో తాగునీటి సరఫరా బాధ్యతలను సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్)కు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇలా చేయడం వల్ల పరిపాలన సౌలభ్యంతో పాటు అర్బన్ మిషన్ భగీరథ ఫలాలను గడప గడపకు చేర్చాలనే ప్రభుత్వం సంకల్పం నెరవేనున్నది. జలమండలి అధికారులతో సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్), పబ్లిక్ హెల్త్ ఉన్నతాధికారులు ఇప్పటికే మూడు సార్లు సమావేశమై ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు సమాచారం.
హైదరాబాద్ శివారులో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘అర్బన్ మిషన్ భగీరథ’ కింద సుమారు రూ.750కోట్లతో ఫస్ట్ఫేజ్ పూర్తి చేశారు. రెండో ఫేజ్ కింద మరో రూ.1200ల కోట్లతో జీహెచ్ఎంసీ అవతల నుంచి ఔటర్ రింగురోడ్డు వరకు ఉన్న గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో తాగునీటిని సరఫరా వ్యవస్థను మరింత పక్కాగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జలమండలిపై భారాన్ని తప్పించడంతో పాటు స్థానిక సంస్థల ద్వారా శివారులో తాగునీటి, మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంతో శివారు ప్రాంత ప్రజలకు దూరం తగ్గడంతో పాటు ఆర్థిక భారం తగ్గుతుందని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నా రు. ప్రస్తుతం నల్లా కనెక్షన్ తీసుకునేందుకు జీహెచ్ఎం సీ పరిధిలో ఉన్న జలమండలి నిబంధనలనే శివారులోను అమలు జరుగుతున్నాయి. కానీ స్థానిక సంస్థల కు ఈ బాధ్యతలను అప్పగించడం వల్ల ప్రజలు ఇంటికి దగ్గరలోని మున్సిపల్ కార్యాలయంలో అనుమతులను పొందుతారు. దీంతో ప్రజల ముంగిట సేవలు అందుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం త్వరలోనే తీసుకోయే నిర్ణయంతో నీటి, సీవరేజీ బిల్లులను కూడా స్థానిక సంస్థలే వసూలు చేస్తాయి. దీని వల్ల స్థానిక సంస్థల ఆదాయం వృద్ధిని సాధించే అవకాశం ఉన్నది,శివారు తాగునీటి సరఫరా బాధ్యతల నుంచి జలమండలిని తప్పిస్తే జలమండలిపై పడిన అదనపు భారం తగ్గుతుందని, జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సరఫరాతో పాటు మురుగునీటి నిర్వహణ మరింత బలోపేతం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఔటర్ వరకు ప్రాంతాల తాగునీటి సరఫరా బాధ్యతలను సీడీఎంఏకు అప్పగించే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆగస్టు మొదటి వారంలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెల్లడించే అవకాశం ఉందని జలమండలిలో చర్చ సాగుతున్నది. ఈ అంశంపై జలమండలి మేనేజర్లతో కూడా జలమండలి ఉన్నతాధికారులు సమావేశమై దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఉత్తర్వులు వచ్చిన తరువాత శివారులో పని చేస్తున్న జలమండలి అధికారుల విధులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.