సిటీబ్యూరో, జూలై 2: (నమస్తే తెలంగాణ) : సుట్టం సూపుగ వచ్చిన మనిషి రాంగనే కాళ్లు కడుక్కోమని నీళ్లిస్తరు. తెలంగాణలో పల్లెకు పోయినా..పట్నం పోయినా.. ఇదే మొదటి మర్యాద. హైదరాబాద్ మహానగర శివారులో ఉన్న పీర్జాదిగుట్టకు పోతె కొద్ది రోజుల కిందటి వరకు ఈ మర్యాదే ఉండేది గాదు. సుట్టం ఇంటికిపోతె చెంబెడు నీళ్ల్లియ్యనీకి చేతులు రాకపోయేది ఆ బస్తీ వాసులకు.. ఇదేం మర్యాద అనుకోవద్దు.. ఈడ నీళ్లే బంగారమనేవారు.. బంధువులు వచ్చి నిద్ర జేస్తానంటే.. ఆ ఇంట్ల ఎవలికీ నిద్రపట్టేది కాదు. గుక్కెడు నీళ్ల కోసం దూరం వెళ్లాల్సి వచ్చేది. కష్టాలు, కన్నీళ్లు కలగలిపి కావడి కుండలు మోసిన ఆ బస్తీలో కాయలుగాసిన భుజాలెన్నో నేటికీ దర్శనమిస్తాయి.
పెళ్లీడుకొచ్చిన ఆ బస్తీల యువకులకు పిల్లనిచ్చేందుకు దడుసుకునేవారు. మహానగరానికి స్వాగతద్వారంగా చెప్పుకునే పీర్జాదిగూడ గుట్టపై ఉన్న చెన్నారెడ్డి బస్తీ, రాధాకృష్ణా బస్తీవాసుల ఒకప్పటి నీటి కష్టాలివి. మూడు దశాబ్దాల్లో ఎంతో మంది లీడర్లు వీళ్లను ఓటర్లుగా చూశారు కానీ..వారి కనీస అవసరం తీర్చలేదు. పైగా పల్లములో ఉన్న కాలనీలకే దిక్కులేదు.. మీ గుట్టకేడ తెచ్చియాలనే ఎటకారపు సమాధానాలెన్నో వాళ్ల మదిలో ఉన్నాయి. ఎవరికీ పట్టని బస్తీల క‘న్నీటి’ గోసని మిషన్ భగీరథ తీర్చింది. అవును.. అపర భగీరథుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.కోట్లను వెచ్చించి కృష్ణమ్మను పీర్జాదిగూడ గుట్టపైకి మళ్లించి.. ఆ ప్రాంత ప్రజల 30 ఏండ్ల దాహార్తిని తీర్చారు.
పీర్జాదిగూడ ప్రాంతంలో నీటి సరఫరా బాధ్యతను గతంలో ఆర్డబ్ల్యూఎస్ విభాగం చూసేది. ప్రస్తుతం జలమండలి నిర్వహిస్తున్నది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గతంలో వేసవిలో ఈ ప్రాంతంలో 350 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరిగేది. కానీ ఇప్పుడు అలాంటి అవసరమే ఉండటం లేదు. కేవలం కమర్షియల్ అవసరాలకు మాత్రం నెలకు నాలుగైదు ట్యాంకర్లు నడుస్తున్నాయి. ఇవికూడా నెలలో 4-6 ట్రిప్పులు నడిస్తే ఎక్కువ. కొత్తగా 4.4 ఎంఎల్ సామర్థ్యం కలిగిన ఆరు రిజర్వాయర్లు నిర్మించారు. రూ.20 కోట్ల వరకు వెచ్చించి పక్కాగా నీటి సరఫరా జరిగేందుకు కొత్తగా 125-135 కిలోమీటర్ల అంతర్గత పైపులైన్లను వేయడంతో పాటు సుమారు రూ.3.5కోట్ల మున్సిపల్ నిధులతో మరో 25 కిలోమీటర్ల పైపులైన్లను, 44 జంక్షన్లను ఏర్పాటు చేశారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రక్షిత నీటి సరఫరా (మరమ్మతులు/నిర్వహణ) కోసం కార్పొరేషన్ నుంచి ప్రతినెలా రూ.10 లక్షలు ఇస్తున్నారు.
నిన్నటి దాకా ఆ గుట్ట మీద నీళ్లని బంగారం లెక్క వాడుకున్నరు. కానీ బంగారు తెలంగాణలో ఒక్క రూపాయితో నల్లా కనెక్షన్ పొంది నేడు వేల లీటర్ల నీళ్లను పొందుతున్నరు. సుట్టం రావాలంటేనే భయపడే ఆ బస్తీకి ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి.. సుట్టాలతో పాటు చాలా మంది పిల్లనిచ్చేందుకు వస్తున్నారని ఆ బస్తీ ప్రజలు సంబురంగా చెబుతున్నారు. కేవలం మూసీ మురుగు పరుగులు మాత్రమే చూసిన ఆ బస్తీల్లో.. ఇప్పుడు కష్ణమ్మ జలాలు గడపగడపను తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నారెడ్డి, రాధాకృష్ణా బస్తీల ప్రజలను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా, గత అనుభవాలు, భావోద్వేగాలతో పాటు ప్రస్తుత అనుభూతిని పంచుకున్నారు.
పీర్జాదిగూడ ప్రాంతంలో సుమారు 4.5 నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటుంది. తెల్లరేషన్ కార్డుదారులకు రూ.1కే నల్లా కనెక్షన్ ఇస్తున్నారు. ఇలా మొత్తం సుమారు 8 బస్తీల్లో, 150 కాలనీల్లో ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అధికారికంగా సుమారు 14వేల నల్లానీటి కనెక్షన్లు ఉన్నాయి. గతంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు వరకు 10 నుంచి 15 రోజులకు ఒకసారి చొప్పున కేవలం 3 ఎంఎల్డీల నీరు మాత్రమే సరఫరా అయ్యేది. కానీ ప్రస్తుతం 14 ఎంఎల్డీల నీరు ప్రతిరోజూ సరఫరా అవుతున్నది.
నా పేరు ఎస్కె అహ్మద్. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నీళ్లు మోస్తూనే ఉన్న. కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి.. నీళ్ల బిందెలు నెత్తిల.. కొంతసేపు భుజం మీద కొంత సేపు ఎత్తుకొని ఈ గుట్ట ఎక్కేది. మోసి మోసి నా భుజం కాయకాసింది. గీ పల్లములున్న కాలనీలోనే నీళ్లు రావడం లేదు.. నీ గుట్ట మీద ఏడ ఎక్కుతయి పో.. అనేటోళ్లు లీడర్లు, అధికారులు. మేడిపల్లి కాడున్న చేదుడు బావి, గుట్టకింద ఉన్న చిన్న ట్యాంకే మాకు దిక్కు. ఎప్పుడైనా ఒక్క ట్యాంకర్ వస్తే.. బిందెడు నీళ్ల కోసం తలలు పగిలేవి. నీళ్ల కోసం కొట్టుకొని ఎన్నోసార్లు పోలీస్స్టేషన్ల పడ్డాం. ఆడ బిడ్డల కష్టం చూస్తే.. గుండె పిండినట్లు అయ్యేది. చిన్న, పెద్ద అనే తేడానే లేదు.. నీరసం వచ్చేట్లు నడిస్తేనే గుక్కెడు నీళ్లు దక్కేవి. ఓ రెండు ఏండ్ల కిందట చెప్పినట్లుగానే గుట్టను తవ్వి పెద్ద ట్యాంకు కట్టారు. ఇప్పుడు దినం విడిచి దినం నీళ్లోస్తున్నాయి. ఈ నీళ్లను చూసి అప్పటి కష్టాలు గుర్తుకు వస్తే.. కన్నీళ్లు ఆగవు మా బస్తీలోళ్లకు. కేసీఆర్ సార్ సల్లంగుండ..మాకైతే మస్తు నీళ్లిస్తుండు.
నా పేరు రాజేశ్వరి. ఇక్కడే పుట్టి పెరిగిన. చిన్నప్పటి నుంచి నీటి కష్టాలే. నెలలో ఒకటికి రెండు సార్లు గుట్టకిందికి ట్యాంకర్ వచ్చేది. అప్పుడు ఓ చేతిలో బిందే.. మరో చేతిలో ఏ అమ్మదో సిగ. ఒక్క బిందకు వంద పంచాయతీలు జరిగేవి మా బస్తీల. అప్పుడప్పుడు నీళ్లు కింద వృథా పోతున్నట్లు, పైపులు పగిలినట్లు టీవీల చూస్తే మా గుండె తరుక్కుపోయేది. మా దగ్గరనన్న పైపు పగలదాయో ఒక్క రోజన్న.. మనస్ఫూర్తిగా తాగి డ్రమ్ముల నిండ పట్టుకునేటోళ్లం కదా అనిపిచ్చేది. నా చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని మాకు నీళ్లు ఎప్పుడు వస్తాయో అని. ముఖం కడగాలన్నా..స్నానం చేయాలన్నా.. బట్టలు ఉతకాలన్నా.. చుక్కలు కనిపించేవి. ఒక్క బకెట్తోనే అన్ని పనులు చేసుకునేటోళ్లం.
గతంలో బిందెడు నీళ్లు తాగేందుకు తెచ్చుకొని, ఓ రెండు మూడు బకెట్ల నీళ్లు చేదుడు బావిలో తెచ్చుకునేటోళ్లం. కానీ ఇప్పుడు అన్ని పనులకు భగీరథ నీళ్లనే వాడుతున్నం. రోజు తప్పించి రోజు వస్తున్నాయి. నీళ్ల బాధలు తప్పినయి. మా బస్తీకి ఓ ట్యాంకు కట్టిస్తే చాలనుకున్న కానీ.. అన్ని ఇండ్లకు ఇంటింటికీ, గడప గడపకు నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు మా బస్తీకి నీళ్లు వస్తున్నాయంటే మా చుట్టాలు కూడా అవునా.. మీకు నీళ్లు వస్తున్నాయా అంటున్నరు. చెప్పలేనంత ఆనందం అవుతున్నది. మా గుండెల బాధలను తీర్చి గొంతు తడిపిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, మేయర్ వెంకట్రెడ్డి సార్ల మేలు మరువం. మాకు నీళ్లిచ్చిన కేసీఆర్కు జీవితమంత రుణపడి ఉంటాం.
నా పేరు అశ్రఫ్బేగం. ఈ బస్తీలో 30 ఏండ్లుగా ఉంటున్న. కూలీ చేసి పొట్టపోసుకునే బతుకులు మావి. పొద్దున నాలుగైదు గంటలకు లేచి ఒక్క బిందె నీళ్ల కోసం నాలుగు కిలోమీటర్లు నడిచి ఉప్పల్ బీరప్పగడ్డ వద్ద నుంచి తెచ్చుకునేటోళ్లం. అంతదూరం పోతే ఒకటి రెండు బిందెలు దొరికేవి. ఆ నీళ్లను మా భుజాలపై, సైకిళ్లపై మోసుకొస్తుంటే.. మా భుజం బొక్కలు మొద్దుబారేవి. పీర్జాదిగుట్ట ఎక్కేవరకు కాళ్లు, చేతులకు తిమ్మిర్లు వచ్చేవి. అంతకష్టపడి తెచ్చుకున్న నీళ్లను బంగారం కంటే ఎక్కువ దాచుకునేటోళ్లం. ఇంటికి సుట్టమొస్తే..నీళ్లిచ్చేందుకు మనసొప్పేది కాదు. కానీ నీళ్లు కూడా ఇవ్వకపోతిమని కుమిలిపోయేటోళ్లం. మేడిపల్లి మండల ఆఫీస్ ముందు పెద్ద చేదుడుబావిలో నీళ్లను చేదుకొస్తేనే మేము, పిల్లలం స్నానాలు చేసుడు.. బట్టలు ఉతుకుడు.
లేదంటే.. ఇక అంతే. గతం తల్సుకుంటే దుఃఖం ఆగదు. చిమ్మచీకట్లలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మూసీదాక పోయోటోళ్లం. 30 ఏండ్ల నుంచి ఏ ఒక్కరూ మమ్మల్ని పట్టించుకోలే. మున్సిపల్ ఎన్నికలప్పుడు కొందరు నాయకులు వచ్చి ఇంటింటికీ కేసీఆర్ సారు నీళ్లిస్తారని చెప్పిండ్రు. ఎన్నికలు అయిపోగానే..తెల్లరేషన్ కార్డు తీసుకొని నీళ్ల ఆఫీస్కు పోతే.. ఒక్క రూపాయి తీసుకొని మా బస్తీలో నాతో పాటు సుమారు రెండు వందల మందికి ఇంటింటికీ నల్లా వేశారు. ఇప్పుడు రోజు తప్పించి రోజు మాకు ఫుల్గా నీళ్లు వస్తున్నాయి. ట్యాంకులు, డ్రమ్ములు నిండి ఎక్కువైతున్నాయి. నీళ్లు ఇచ్చిన సీఎం కేసీఆర్ సారే మాకు దేవుడు. ఆయన మేలు మరువం.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భగీరథ ప్రయత్నం ఫలితంగానే నేడు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో తాగునీటి కష్టాలు తీరినాయి. అన్ని ప్రాంతాల్లో రోజు విడిచి రోజు నీళ్లు వస్తున్నాయి. నీటి అవస్థలు తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి మల్లారెడ్డిలకు మా పాలకవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. -జక్కా వెంకట్రెడ్డి, మేయర్ , పీర్జాదిగూడ
డిమాండ్కు సరిపడా సరఫరా
వినియోగదారుల డిమాండ్కు సరిపడా నీటిని అందిస్తున్నాం. ఆ రెండు బస్తీల 30 ఏండ్ల నిరీక్షణకు తెరదించి రోజు విడిచి రోజు సరఫరా చేసున్నాం. ఇది నా సర్వీసులో గొప్ప అనుభూతి. కొత్తగా సుమారు 6వేల వరకు నీటి కనెక్షన్లు ఇచ్చాం. రక్షిత తాగునీటిని జలమండలి సరఫరా చేస్తున్నది. -విజయ్పాల్రెడ్డి, జలమండలి వర్క్ ఇన్సెక్టర్