బేగంపేట్ నవంబర్ 19: ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం సనత్నగర్ నియోజకర్గం రాంగోపాల్పేట్ డివిజన్లో ఆయన ఇంటింటా పాదయాత్ర నిర్వహించారు. డివిజన్లోని జీరా క్లబ్, గార్డెన్స్, ఇందిరానగర్, గుజరాతీ స్కూల్, కస్తూర్బా నగర్, అంబేద్కర్నగర్, వెంగల్రావునగర్, తదితర ప్రాంతాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.
ఈ క్రమంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేశారని తెలిపారు. ప్రజలంతా బీఆర్ఎస్కే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ క్రమంలో సనత్నగర్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిన అర్హులైన పేదలకు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకప్పుడు రాంగోపాల్పేట్ డివిజన్లోని అంబేద్కర్ నగర్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉంది స్థానిక ప్రజలు పోల్చుకోవాలని సూచించారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారని చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజలు గౌరవంగా జీవించాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. కార్యక్రమంలో రాంగోపాల్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్గౌడ్, ఆంజనేయులు, మల్లికార్జున్గౌడ్ పాల్గొన్నారు.
బేగంపేట్ నవంబర్ 19: తెలంగాణ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని సనత్నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శనివారం రాత్రి బేగంపేట్ డివిజన్లోని ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ…కాంగ్రెస్,బీజేపీ నాయకులకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తు వస్తారని అన్నారు. అధికారంలో ఉన్నంత కాలం ప్రజలను ఓటు బ్యాంకు లాగా చూశారు తప్ప వారి సమస్యలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. 40 సంవత్సరాలుగా తమకు ఖబరస్తాన్ ఏర్పాటు చేయాలని బేగంపేట్లోని ముస్లింలు కోరుతూ వస్తున్నా గతంలో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన నాయకులు పట్టించుకోలేదన్నారు. ఈ ప్రాంతం ప్రజల ఓట్లతో గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి కేంద్రమంత్రిగా పని చేసిన ఆయన కుమారుడు మర్రి శశిధర్రెడ్డి ఏనాడు ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. కనీసం ప్రజలకు అందుబాటులో కూడా ఉండేవారు కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వచ్చామని తెలిపారు.
బేగంపేట్లోని ఖబరస్తాన్ సమస్య ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ల దృష్టికి తీసుకెళ్లి అక్కడ 2 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు అభివృద్ధికి రూ 3 కోట్లు కేటాయించిన విషయాన్ని తెలిపారు. అలాగే ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో అండర్ రైల్వే బ్రిడ్జిని నిర్మించి ఏండ్ల నాటి కస్టమ్స్ బస్తీ ప్రజల సమస్యలను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. పేదింటి ఆడపడుచుల వివాహాలను షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద పేదింటి బిడ్డలకు పెండ్లి ఖర్చులకు లక్ష నూట పదహార్లు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో పేదోడి గురించి ఆలోచించిన నాయకులు ఏవరైనా ఉన్నా అని ప్రశ్నించారు. రంజాన్ పండగ వస్తే అన్ని ఏర్పాట్లు చేస్తూ పండగలను సైతం గొప్పగా చేస్తున్నా విషయాన్ని తెలిపారు. ఏవరికి ఏ అవసరం వచ్చిన నేనున్నా అనే భరోసాను నియోజకవర్గం ప్రజలకు కల్పించానని చెప్పారు. అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలిపించాలని కోరారు.