హైదరాబాద్ : ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వార్డు కార్యాలయాలను ప్రారంభించామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) తెలిపారు. వార్డు కార్యాలయ సేవలను(Services) సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ రెజిమెంటల్ బజార్, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కావాడిగూడ డివిజన్ తాళ్ల బస్తీ లో వార్డు కార్యాలయాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి ప్రారంభించారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని బేగంబజార్ లలో వార్డు ఆఫీను ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలను అందించడంతో పాటు సమస్యలను వేగంగా పరిష్కరించాలనే ఆలోచనతోనే వార్డు ఆఫీసుల(Ward Offices)ను ఏర్పాటు చేశామని అన్నారు. వార్డు ఆఫీసు వ్యవస్థతో జీహెచ్ఎంసీ (GHMC), ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్, ఎంట మాలజీ తదితర 11 విభాగాలకు చెందిన అధికారులు(Departmental Officers) అందుబాటులో ఉంటారని చెప్పారు.
వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. అంతేకాకుండా ఆయా శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని చెప్పారు. వార్డు స్థాయిలో కార్పొరేటర్లు ఉన్నా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా లేకపోవడం వల్ల ఈ వార్డు కార్యాలయ వ్యవస్థను తీసుకువచ్చామని తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డు ఆఫీసులు
జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ లలో 150 వార్డు ఆఫీసులను ప్రారంభించాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. మొదటగా 132 ఆఫీసులను తొలిదశలో ప్రారంభించుకుంటున్నామని వివరించారు. మిగిలిన ఆఫీసులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. వార్డు కార్యాలయానికి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇన్చార్జిగాఉంటారని అన్నారు.
పౌరుల సమస్యల పరిష్కారానికి నిర్ణీతమైన గడువుతో కూడిన సిటిజన్ చార్టర్ కూడా అమలు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మొండా మార్కెట్, కవాడి గూడ, బేగంబజార్ కార్పొరేటర్ లు దీపికా, రచనాశ్రీ, శంకర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఆకుల రూప, మమతా సంతోష్ గుప్తా, పరమేశ్వరి సింగ్, జోనల్ కమిషనర్ లు శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్, డీసీలు ముకుంద రెడ్డి, మోహన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.