బేగంపేట్, సెప్టెంబర్ 1: ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు బోధన జరగాలనేది ప్రభుత్వ ఆలోచన అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని పద్మారావునగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమంలో భాగంగా జరిగిన అభివృద్ధి పనులను మంత్రి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠాలు బాగా చెబుతున్నారా? భోజనం బాగుంటుందా..? తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా? అని సిబ్బందిని, విద్యాశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెండు తరగతి గదులు నిర్మించాల్సి ఉందని, ఏసీడీపీ నిధులతో నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పాఠశాలలో వివిధ తరగతి గదులకు వేసిన రంగులను పరిశీలించారు. వీటిలో త్వరలోనే ఒ కలర్ను ఎంపిక చేసి ప్రభుత్వ అనుమతి అనంతరం, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు అవే రంగులు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి, కార్పొరేటర్ హేమలత, పద్మారావునగర్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ పవన్ కుమార్ గౌడ్, ముషీరాబాద్ మండలం ఉప విద్యాశాఖ అధికారి చిరంజీవి, పాఠశాల హెచ్ఎం ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.