బన్సీలాల్పేట్, డిసెంబర్ 2 : చారిత్రాత్మక బావులను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్పేట్లోని పునరుద్ధరించిన మెట్లబావిని పరిశీలించారు. ఈ నెల 5న సాయంత్రం 5 గంటలకు మంత్రి కేటీఆర్ ఈ మెట్లబావిని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి తలసాని, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే.హేమలత, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి పరిశీలించారు. టూరిస్ట్ ప్లాజా భవనం, మెట్లబావి నమూనా, బావి తవ్వకం సందర్భంలో వెలికితీసిన పురాతన వస్తువుల ప్రదర్శన, ఫొటో ప్రదర్శన, పార్కులను సందర్శించారు.
అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ… శిథిలావస్థకు చేరిన, చారిత్రాత్మక బావులను కాపాడుకోవాలని, రాబోయే తరాలకు వాటి ప్రాముఖ్యతలు తెలిజేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇందుకు మంత్రి కేటీఆర్ చొరవతో, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల ఆధ్వర్యంలో సాహే, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ మెట్లబావిని అభివృద్ధి చేశామని తెలిపారు. నగరంలో 44 చారిత్రాత్మక బావులను గుర్తించామని, ఐదింటిని పూర్తి చేశామని, బన్సీలాల్పేట్లోని మెట్లబావి 6వ అందమైన బావిగా రూపుదిద్దుకున్నదని మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ ఎస్ఈ అనిల్రాజ్, ఈఈ సుదర్శన్, జలమండలి జీఎం రమణారెడ్డి, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు కల్పనా రమేశ్, టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి, టీఆర్ఎస్ నాయకులు జి.పవన్కుమార్ గౌడ్, వెంకటేశన్రాజు, కే.లక్ష్మీపతి, కమల్కుమార్, బన్సీలాల్పేట్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.ఏ.ఫహీమ్, కార్యదర్శి పురుషోత్తం పాల్గొన్నారు.