హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి 150 కిలోల లడ్డును సమర్పించి పూజలు నిర్వహించారు. మంత్రి దంపతులను నిర్వాహకులు శాలువాతో సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అన్ని పండుగలను ఎంతో ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. లక్షలాది మంది వచ్చి దర్శించుకొనే ఖైరతాబాద్ వినాయక మండపం వద్ద అధికారులతో కలిసి పర్యటించి భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
మంత్రి వెంట సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, బెవరేజేస్ కర్పోరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, బాక్సర్ అశోక్, రాంరెడ్డి, మహేందర్, తదితరులు ఉన్నారు.