ఖైరతాబాద్, జనవరి 16: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పీవీ మార్గ్లోని పీపుల్స్ ప్లాజాలో మంత్రి తలసాని ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, సంక్రాంతి పాటలతో పీపుల్స్ ప్లాజా ప్రాంగణం సందడిగా మారింది. చిన్నారులకు పతంగులను పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పతంగులు ఎగురవేశారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. దేశవిదేశాల్లోనూ తెలుగు సంస్కృతికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయన్నారు. సంక్రాంతి అంటేనే కుటుంబ ఉత్సవమని.. తెలుగు పండుగల ప్రాధాన్యాన్ని పిల్లలకు తెలియజెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న రాంమూర్తి, బీఆర్ఎస్ నాయకులు పవన్కుమార్ గౌడ్, బాల్రాజ్ యాదవ్, అత్తిలి శ్రీనివాస గౌడ్,ఆకుల హరికృష్ణ పాల్గొన్నారు.