అమీర్పేట్ : జీవజలమైన నీటి విలువను తెలుసుకుని పొదుపుగా వాడుకోవాలని, ప్రతి ఒక్కరూ నీటి వృథాను అరికట్టాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సోమవారం మారెడ్పల్లిలోని తన నివాసం వద్ద జలమండలి ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఆధునీకరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహజ వనరులైన నీటిని పరిరక్షించి, రాబోయే తరాలకు వాటిని అందిద్దామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, చెరువుల పునరుద్ధీకరణ పనులను చేపట్టిందని, కాళేశ్వరం లాంటి అనేక ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టిందని గుర్తుచేశారు. వర్షపు నీరు భూమిలో ఇంకేలా ప్రజలు తమ తమ ఇండ్లు, అపార్ట్మెంట్లలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సనత్నగర్ కార్పొరేటర్ కోలన్ లక్ష్మిరెడ్డి, జలమండలి సీజీఎం ప్రభు, మారెడ్పల్లి డివిజన్ జనరల్ మేనేజర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుందర్నగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, జలమండలి సీజీఎం ఎం.ప్రభు, జీఎం హరిశంకర్, డీజీఎం శ్రీనివాస్, ప్రకృతి పర్యావరణ సంస్థ సీఈవో రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో నీటి వనరుల పరిరక్షణ, వర్షపు నీటి సద్వినియోగం చేసుకునేందుకు వీలు గా ఇంకుడు గుంతల నిర్మాణాలు వంటి అంశాలపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు సమృద్ధికరంగా నీటి వనరులను అందించేందుకు ప్రతీ వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొలను బాల్రెడ్డి, సంతోష్ షరఫ్ పటేల్, ఝాన్సీరెడ్డి, రుక్మిణిరెడ్డి, పుష్పలత, పద్మ పాల్గొన్నారు.
15 ఇంకుడు గుంతల పునరుద్ధరణ..
గతంలో నిర్మించిన ఇంకుడు గుంతలను పునరుద్ధరించే క్రమంలో భాగంగా సోమవారం సనత్నగర్ డివిజన్లో దాదాపు 15 ఇంకుడు గుంత ల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే పను లు చేపట్టారు. వర్షాలు పడితే పూర్తి స్థాయిలో నీటిని తీసుకునే విధంగా వీటిని తీర్చిదిద్దారు. సుందర్నగర్ కాలనీలో 5, మోడల్కాలనీలో 3, ఎల్ఐజీ క్వార్టర్లలో 3, జెక్కాలనీలో 2, సనత్నగర్ ఎస్ఆర్టీ రౌండ్ టేబుల్ స్కూల్లో ఒకటి చొప్పున ప్రకృతి పర్యావరణ సంస్థ ప్రతినిధులు ఇంకుడు గుంతలను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సుందర్నగర్ కాలనీలో పునరుద్ధరించిన ఇంకుడు గుంతల దగ్గర కాలనీవాసులతో ప్రకృతి పర్యావరణ సంస్థ సీఈవో రాజశ్రీ నీటి పరిరక్షణకు పాటు పడతామని ప్రతిజ్ఞ చేయించారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలి
బన్సీలాల్పేట్, మార్చి 22 : భవిష్యత్తు తరాల కోసం నీటిని పొదుపుగా వాడుకోవాలని పద్మారావునగర్లోని సర్దార్ పటేల్ కళాశాల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.నర్మద సూచిం చారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సోమవారం కళాశాలకు చెందిన బోటనీ విభాగం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు నీటి పొదుపుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పద్మారావునగర్ పరిసరాల్లో ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ముదిగొండ అమర్నాధ శర్మ, బోటనీ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.