హైదరాబాద్ : గోషామహల్లోని చాక్నావాడి ప్రాంతంలో నాలా పైకప్పు కుంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నాలా అభివృద్ధి పనులకు రూ. కోటి 27 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాలా అభివృద్ధి పనులు రెండు, మూడు రోజుల్లో ప్రారంభం అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. నాలాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. అక్రమ నిర్మాణాలపై దందా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు.
గత శుక్రవారం గోషామహల్లోని చాక్నావాడి ప్రాంతంలో నాలా పైకప్పు కుంగిపోయింది. అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలు నాలాలో పడి ధ్వంసమయ్యాయి. బైక్లు, ఆటోలు, కార్లు, వారాంతపు సంతకు తీసుకువచ్చిన తోపుడు బండ్లు నాలాలో పడిపోయాయి. వారాంతపు సంత కూరగాయలు, ఇతరత్రా సామగ్రి నాలాలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. అఫ్జల్సాగర్ నుంచి మొదలైన నాలా ఆగాపుర, దారుసలాం, గోషామహల్, చాక్నావాడి, గోషామహల్ బరాదరి మీదుగా తోప్ఖానా, ఉస్మాన్గంజ్, కిషన్గంజ్, గౌలిగూడల నుంచి ఎంజీబీఎస్ మీదుగా మూసీలోకి చేరుతుంది.